స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొన్న తెలంగాణ ఐటిశాఖ మంత్రి కేటీఆర్ పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొనేందుకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్లోని దావోస్ లో పర్యటిస్తున్నారు.
టూర్ లో భాగంగా అపోలో టైర్స్ వైస్ చైర్మన్, ఎండీ నీరజ్ కుమార్తో మంత్రి సమావేశయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఆ తర్వాత హెచ్పీఈ సీవోవో విశాల్ లాల్తోనూ ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వారికి వివరించారు. అనంతరం దావోస్ సదస్సులో కార్ల్స్ బర్గ్ గ్రూప్ గ్రూప్ ఛైర్మన్ ఫ్లెమింగ్ బెసెన్ బెకర్ మంత్రి కేటీఆర్ తో మీట్ అయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. మరోవైపు రోషె గ్రూప్ ఛైర్మన్ క్రిస్టో ఫ్రెంజ్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఫార్మా రంగానికి సంబంధించి తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరంగా చెప్పారు. ఫార్మా హబ్ గా తెలంగాణ అభివృద్ధి చెందుతుందని వివరించారు. త్వరలోనే హైదరాబాద్ లో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఫార్మా, మెడికల్ డివైజెస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం 50వ వార్షిక సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. సీఎన్బీసీ టీవీ-18 నిర్వహించిన ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్నోవేషన్ నేషన్ చర్చా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మన దేశం, మన రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలు, అనుకూలతలు వివరించారు. పారిశ్రామిక, వ్యాపార వేత్తలకు అందిస్తున్న ప్రత్యేక ప్రోత్సాకాలను తెలియజేశారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ ముందంజలో ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈవోడీబీతో పాటు కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ , క్వాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను వినియోగించడంతో పాటు, మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారాయన.
భారత్ తో పాటు రాష్ట్రాలన్ని మరింత బలోపేతం కావాలంటే ఇన్నోవేషన్, ఇన్ క్లూజివ్ గ్రోత్, ఇన్ ఫ్రా స్ట్రక్చర్.. అనే త్రీ ఐ మంత్ర పాటించాలని సూచించారు. దేశ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం ప్రతిపాదించిన 102 లక్షల కోట్ల ప్రాజెక్టుల్లో… తెలంగాణకు తగిన ప్రాధాన్యం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.