ఈ నెల 12 నుంచి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరుపతలపెట్టిన ఉపాధ్యాయ నిరవధిక నిరాహార దీక్షలు జయప్రదం చేయాలని ఫ్యాప్టో చైర్మన్, ఎస్ టి యు జిల్లా అధ్యక్షులు పేడాడ ప్రభాకరరావు విజ్ఞప్తి చేశారు.
నేడు ఎస్ టి యు జిల్లా కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన సంఘ కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒకటిన్నర సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే అన్ని ప్రభుత్వ శాఖలకు బదిలీలు జరిపి ఉపాధ్యాయ బదిలీలు జరపకపోవడం విచారకరం అన్నారు.
గత ఏడాది దసరా సెలవుల్లో బదిలీలు జరుపుతామని విద్యా శాఖ మంత్రి ప్రకటన చేసి తరువాత సంక్రాంతి సెలవుల్లో అని, వేసవి.. సెలవుల్లో అని మొన్నటికి మొన్న సెప్టెంబరు ఐదు నాటికి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పి చేయలేదని అన్నారు.
విద్యా సమీక్షలో చెప్పి ఇంతవరకు బదిలీల షెడ్యూల్ విడుదల చేయకుండా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సిఫార్సు బదిలీలు చేస్తూ కౌన్సిలింగ్ విధానానికి తూట్లు పొడవటం బాధాకరమన్నారు.
ప్రభుత్వం ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారంలో అవలంబిస్తున్న ఉదాసీన వైఖరి, సాచివేత ధోరణికి నిరసనగా రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈనెల 12 నుండి ఇ 21 వరకు పది రోజులు నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు.
ఈ దీక్షలకు జిల్లా నలుమూలల నుండి ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్ టి యు కార్యకర్తలు నియోజకవర్గాల వారీగా ప్రతిరోజు దీక్షల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఇవీ డిమాండ్లు:1 అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు తక్షణమే జారీ చేయాలి.2. 2019 నుండి చేపట్టిన పదోన్నతులు అప్గ్రేడెడ్ స్థానాలను రిక్రూట్మెంట్ స్థానాలను బదిలీలకు క్లియర్ వేకెన్సీలుగా చూపించాలి.
3. రేషనలైజేషన్ ప్రక్రియ లో ఫ్యాప్టో ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలి.4. ప్రభుత్వం చేస్తున్న అక్రమ బదిలీలను రద్దు చేసి, సీఎం కార్యాలయం నుండి నేరుగా చేస్తున్నా సిఫార్సు బదిలీలు నిలిపివేయాలి.
5. 2018 జూలై 1 నుండి ఆర్థిక ప్రయోజనం కలిగిస్తూ పి ఆర్ సి ని అమలు చేస్తూ బకాయిపడ్డ ఐదు డీఏలు వెంటనే విడుదల చేయాలి.6. అర్హులైన స్కూల్ అసిస్టెంట్ ల ద్వారా ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్లు, డైట్ లెక్చరర్,మండల విద్యాశాఖ అధికారి పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.