భారీ వర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు ఆర్ధిక సహాయంగా గతంలో ఏ ప్రభుత్వం అందించని విధంగా 10 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి తన ఉదారత్వాన్ని చాటుకున్నారని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నగరంలో వరదనీటి ముంపుకు ఇండ్లు గురై నష్టపోయిన బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రకటించిన 10 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని గురువారం మంత్రి పలు ప్రాంతాలలో స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, అధికారులతో కలిసి అందజేశారు.
ముందుగా ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని BS మక్తా లో MLA దానం నాగేందర్ తో కలిసి, కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని గాంధీనగర్ లో MLA సాయన్న, గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని గన్ ఫౌండ్రీ డివిజన్ లో కార్పొరేటర్ మమతాగుప్తా లతో కలిసి బాధిత కుటుంబాలకు 10 వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించడం కోసం ముందుగా ముఖ్యమంత్రి 550 కోట్ల రూపాయలు విడుదల చేయగా పంపిణీ చేసినట్లు తెలిపారు.
కాగా ఇంకా ప్రభుత్వ సహాయం అందని బాధిత కుటుంబాలు ఉన్నట్లుగా గుర్తించి మిగిలిన వారికి కూడా ఆర్ధిక సహాయం అందజేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యవేక్షణలో పంపిణీ ని చేపట్టినట్లు వివరించారు.