అంబర్ పేట నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛకు కారణం అయిన స్వాతంత్ర్య సమరవీరులందరి పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలని, వారి త్యాగాలను ఎప్పుడూ స్మరించుకోవాలని తెలిపారు.
ఆగస్ట్ 15, 1947 స్వాతంత్ర్యం పొందిన తరువాత, 26 జనవరి 1950 నుండి మనం గణతంత్ర దేశంగా మరో చారిత్రాత్మక అడుగువేశామని, ఆరోజు నుండి మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రపంచంలోనే అత్యద్భుతంగా మన రాజ్యాంగాన్ని లిఖించిన అపరమేధావి భారత రత్న బాబా సాహెబ్ డా. బీ.ఆర్ అంబేద్కర్ నైపుణ్యాన్ని, దూరదృష్టిని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రజలందరికీ సమాన హక్కులు కలిగిస్తూ అందరికీ సమాన అవకాశాలు కల్పించే మన రాజ్యాంగానికి అంకితమై కృషి చేయాలని కాలేరు వెంకటేష్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయ్ కుమార్ గౌడ్, పద్మావెంకట్ రెడ్డి, ఉమారమేష్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట