పల్లెప్రగతి అమలుతో అభివృద్ధి పథంలో గ్రామాలు పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని కొమరం బీమ్ జిల్లా సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. 4వ విడత పల్లె ప్రగతిలో భాగంగా నేడు బెజ్జూర్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే గ్రామంలోని సమస్యలు, అభివృద్ధి పై ప్రజలతో చర్చించారు.
అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజాప్రతినిధులు ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. గ్రామాల అభివృద్దే థ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామ పంచాయతీ అత్యధిక నిధులు కేటాయిస్తూ పల్లెల్లో నూతన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని తెలిపారు.
గ్రామాలలో ఆహ్లాదకరమైన వాతవరణం కోసం పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడంతో పాటు,గ్రామాలలో పారిశుధ్యం కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు.
అనంతరం అనారోగ్యంతో బాధపడుతూ పలు ఆసుపత్రులలో చికిత్స పొంది సిఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న పలువురికి సిఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే లబ్దిదారులకు పంపిణీ చేశారు.
పెద్ద సిద్దాపూర్ గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోయిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వారికి ఆర్థిక సహాయంతో పాటు వంటసామాగ్రి అందజేశారు.
ప్రభుత్వం నుండి మరింత సహాయం అందేలా కృషి చేస్తానని వారికి ఎమ్మెల్యే భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి డోకె రోజారమణి, బెజ్జూర్ గ్రామ సర్పంచ్ అన్సర్ హుస్సేన్ నాయకులు వెంకన్న జావీద్ పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు