ఏపిలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు భయపడుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి అన్నారు. దాంతో రాష్ట్రంలో యువత ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు.
ప్రత్యేక హోదా సాధిస్తే యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువ అవుతాయని, తనకు ఓటేస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రత్యేక హోదా సాధించేంది లేదు…. పెట్టేది లేదు అని అర్ధమైపోయిందని సుధాకర్ రెడ్డి తెలిపారు.
ప్రత్యేక హోదా లేని తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో కొత్త కంపెనీలు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వ మొండి వైఖరితో రాష్ట్రానికి వచ్చే కంపెనీలు కూడా పోతున్నాయని ఆయన అన్నారు. అన్ని స్థాయిలలోని అధికార పార్టీ నాయకులు కంపెనీలపై వత్తిడులు తెస్తున్నారని ఆయన అన్నారు.
కంపెనీ పెట్టాలంటే తమకు కప్పం కట్టాలని వైసీపీ నాయకులు బెదిరిస్తుండటం వల్లే రాష్ట్రానికి కంపెనీలు రావడం లేదని ఆయన తెలిపారు.
చిత్తూరు జిల్లా రేణిగుంట దగ్గర మంచి పెట్టుబడితో రిలయన్స్ కంపెనీ వచ్చి ఉండేదని అయితే వైసీపీ నాయకులను కూడా ఆ కంపనీ భయపడి రావడం మానేసిందని సుధాకర్ రెడ్డి తెలిపారు.
ఆ కంపెనీ పెట్టి ఉంటే 20 వేల మందికి ఉపాధికలిగి ఉండేదని ఆయన తెలిపారు. ఒంగోలు పేపర్ మిల్లు, ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్, టెక్ మహేంద్ర, లూలూ గ్రూప్ మన రాష్ట్రానికి రాలేదని ఆయన అన్నారు.
కియా మోటార్స్ విస్తరణ ఆగిపోయిందని సుధాకర్ రెడ్డి తెలిపారు. ఏపిఐఐసి సంస్థ పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి.
అయితే ఆ సంస్థకు చైర్మన్ గా ఉన్న చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా ఆ పని చేయడం లేదని సుధాకర్ రెడ్డి తెలిపారు. ఆమె సొంత జిల్లాకు చెందిన రేణిగుంటలో పెట్టబోయే కంపెనీ వెళ్లిపోతున్నా కూడా రోజా పట్టించుకోలేదని ఆయన అన్నారు.
పారిశ్రామిక రంగంలో రాష్ట్రం లో జరిగే పరిణామాలు రోజా పట్టించుకోవడం లేదని కేవలం జబర్దస్త్ లో డాన్సులు చెయడం తప్ప తన పదవికి న్యాయం చేయడం లేదని ఆయన అన్నారు. పదవి బాధ్యతలు నిర్వహించే తీరిక లేక పోతే హాయిగా జబర్దస్త్ లో డాన్సులు వేసుకోండి మీకు ఏపిఐఐసి పదవి ఎందుకు? అని సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు.
రోజా హయాంలో కనీసం ఎక్కడైనా చిన్ని, మధ్య తరగతి కనీసం కుటీర పరిశ్రమ అయినా వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు.