ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ 7.5 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత ఆర్థిక వ్యవస్థ ఒకటి కావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నదని ఆయన అన్నారు.
తాము అన్ని రంగాలలో నూతన ఆవిష్కరణలకు మద్దతు ఇస్తున్నామని, అందుకే తమ ఆర్ధిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నదని ప్రధాన మంత్రి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సులో ప్రసంగించారు.
ప్రాంతీయ శాంతి భద్రతలు, వాణిజ్యం మరియు కనెక్టివిటీ, సంస్కృతి మరియు పర్యాటకం వంటి సమయోచిత, ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చించడానికి SCO సభ్య దేశాల నాయకులు శుక్రవారంనాడు ఉజ్బెకిస్తాన్ లోని సమర్కండ్లో సమావేశం అయ్యారు.
ప్రధాని మోదీ హిందీలో ప్రసంగించడం గమనార్హం. ప్రస్తుతం భారతదేశంలో 70 వేలకు పైగా స్టార్టప్లు ఉన్నాయి, వీటిలో 100 కంటే ఎక్కువ యునికార్న్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మా అనుభవం SCO దేశాలకు ఉపయోగపడుతుంది. ఈ ప్రయోజనం కోసం మేము SCO సభ్య దేశాలతో అనుభవాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని ఆయన ప్రకటించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్తో సహా షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ)లోని ఇతర సభ్య దేశాల నేతలు ఈ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. SCO శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రత్యేక భేటీ కానున్నారు.