కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే తానే ధర్నాకు దిగుతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై జిల్లా కలెక్టర్ ను కెఏ పాల్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రైతు రాములు ఆత్మహత్య బాధాకరమన్నారు. 2023 లో రైతులకు మణచిరోజులు వచ్చాయన్నారు. ప్రధాని మోడీ రైతులకు ఎంతో సహాయం చేస్తామని వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న ఏమి చేయలేదన్నారు.
ఢిల్లీలో రాకేష్ టికాయత్, 450 సంస్థల నాయకులు తనను ధర్నాకు పిలిచారని తెలిపారు. తాను ధర్నాలో కూర్చునే లోపే కేంద్ర వ్యవసాయ మంత్రి మూడు రైతు వ్యతిరేక బిల్లులను విత్ డ్రా చేసుకున్నారన్నారు. రైతులు తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రాణానికి విలువ కట్టలేమని తెలిపారు. రైతులకు విరుద్ధంగా ఇక్కడ ఎలాంటి కట్టడాలు జరగవని, తాను హామీ ఇస్తున్నానని చెప్పారు.
అవసరం అయితే హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తామన్నారు. పోలీసులు, రైతులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవద్దని కోరారు. నాయకులు వచ్చి రాజకీయాలు చేస్తారని, వారిని నమ్మి మోసపోవద్దన్నారు. ‘నా మాట వినండి.. నన్ను నమ్మండి.. నాకు 10 రోజుల సమయం ఇవ్వండి’ అని రైతులను కోరారు. తాను సంగారెడ్డిలో 1200 ఎకరాల భూమి కొన్నానని, రైతులను ఒప్పించి, మెప్పించి తీసుకున్నానని, అలాగే ఇక్కడ కూడా తీసుకోవాల్సిందన్నారు.
సదాశివపేటలో ఉన్న చారిటీలో రైతుల పిల్లలకు ఉచితంగా విద్య, వైద్యం అందిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పటికే చారిటీ ద్వారా 3,10,000 మంది విద్యార్థులను చదివిస్తున్నానని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతులతో రాజకీయం చేస్తున్నాయని చెప్పారు. శాంతిగా ఉన్న తెలంగాణను సర్వ నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు.
‘కలెక్టర్ గారూ.. మీరు ప్రజాసేవ కోసమే ఉన్నారు. మీ విధులు మీరు నిర్వర్తించండి’ అని కలెక్టర్ కు కెఏ పాల్ సూచించారు. తమ భూమిని కోట్లు ఇచ్చినా వదులుకోవడానికి రైతులు సిద్ధంగా లేరన్నారు. మాస్టర్ ప్లాన్ లేదు.. బొంద ప్లాన్ లేదు. అని విమర్శించారు. తక్షణమే మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేసారు.. కేసీఆర్ గారూ.. రాంగ్ స్టెప్ వేయకండి అని సూచించారు.