బంగాళాఖాతంలోని అల్పపీడనం అంచనాలకు విరుద్ధంగా ఉన్నచోటనే కొనసాగుతోంది. అయితే ఇది రానున్న 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ బలం పుంజుకుంటుందని విశాఖపట్నం వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేడు ఉత్తరకోస్తాంధ్ర, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు పడతాయి.
కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు నమోదవుతాయి. నైరుతి రుతుపవనాలు తమిళనాడు అంతటా వ్యాపించాయి. రాయలసీమలో కూడా మరికొంత ముందుకు కదిలాయి. ఈరోజు ఇవి కోస్తాంధ్ర, తెలంగాణలలో ప్రవేశించనున్నాయి. నిన్న తునిలో 3 సెంటీ మీటర్లు, విశాఖలో ఒక సెంటీ మీటరు వర్షం పడింది.
అటు అల్పపీడనం ఇటు రుతుపవనాలు ఉన్నందున కోస్తాంధ్రలో కొన్ని చోట్ల కుండపోత వర్షాలు పడతాయని, తెలంగాణ, రాయలసీమల్లో అతిభారీ వర్షాలు పడతాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలనీ వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రం ఈదురుగాలులతో అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు పోవద్దని వాతావరణ శాఖ వెల్లడించింది.