సినిమా షూటింగ్ లు మళ్లీ నిలిచిపోయాయి. కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్నందున సినిమా షూటింగ్ చేయడం అంత మంచిది కాదని సినీ పరిశ్రమ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దాంతో మళ్లీ షూటింగ్ లు నిలిపివేశారు. కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి.
అప్పటి నుంచి నిలిచిపోయిన షూటింగ్ లు కొందరు సినీ పరిశ్రమ పెద్దలు చొరవ తీసుకుని ప్రభుత్వాన్ని కోరడంతో మళ్లీ ప్రారంభం అయ్యాయి. సినిమా షూటింగ్ ఎలా చేయాలనే అంశంలో మార్గదర్శకాలను నిర్ధారించేందుకు అన్నపూర్ణా స్టూడియోస్ లో మాక్ షూటింగ్ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు చూపించారు.
అది చూసిన తర్వాత కొద్ది మార్పులు చేసిన ఆయన సినిమా షూటింగ్ లకు అనుమతి ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమా షూటింగ్ లకు అనుమతి ఇవ్వడంతో కొన్ని చిన్న సినిమాల షూటింగ్ ప్రారంభం అయింది. అయితే ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించడం దాదాపుగా అసాధ్యం అని తేలింది.
నోటికి మస్కులు ధరించడం, చేతులకు శానిటైజర్ పూసుకోవడంతో బాటు భౌతిక దూరం పాటించాల్సి ఉన్నందున అది సాధ్యం కావడం లేదు. ప్రాక్టికల్ గా సమస్యలు తలెత్తుతున్నాయి. దీని తో బాటు హైదరాబాద్ లో కరోనా ఉధృతి బాగా ఉన్నది. కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.
షూటింగ్ ల కోసం అనుమతి కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్దకూ కాళ్లు అరిగేలా తిరిగిన చిరంజీవి చిత్రం ఆచార్య షూటింగ్ కూడా మొదలు కాలేదు. చిరంజీవితో బాటు ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లిన రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ కూడా షూటింగ్ పునరుద్ధరించలేదు. నాగార్జున, వెంకటేష్ లకు కొత్త చిత్రం లేకపోవడంతో సమస్యలు రాలేదు. పెద్ద సినిమాల షూటింగ్ ప్రారంభమే కాలేదు. చిన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి.