ఇద్దరు యువకులను మావోయిస్టు పార్టీలో చేరేలా ప్రేరేపించిన మాజీ నక్సలైట్ ను ఇద్దరు యువకులను చాకిచక్యంగా పట్టుకున్నట్లు ములుగు జిల్లా ఎస్. పి డా సంగ్రాంసింగ్ జి. పాటిల్ తెలిపారు. ఇద్దరు యువకులు మావోయిస్టు దళంలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారాన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుకున్న డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ వెంటనే ఓ. ఎస్. డి ములుగు గౌష్ ఆలంకి తెలియపరచడంతో స్థానిక ములుగు పోలీస్ స్టేషన్ ఎస్. ఐ బి. ఓంకార్ యాదవ్ నేతృత్వత్వంలో ఒక టీం ని ఏర్పాటు చేశారు.
ఆ టీమ్ మావోయిస్టు పార్టీలో చేరేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులతో పాటు ప్రేరేపించిన మాజీ నక్సలైట్ బోట్ల అశోక్ ను అరెస్ట్ చేసి FIR నమోదు చేసారు.
వివరాలలోకివెళ్తే మల్లంపల్లి కి చెందిన బాలుగు గణేష్ , జాకారం గ్రామానికి చెందిన పుల్యాల నవీన్, మాజీ నక్సలైట్ బోట్ల అశోక్ ను అరెస్ట్ చేశారు. వారి నుంచి విప్లవ సాహిత్యం సెల్ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు. బొట్ల అశోక్ అనే వ్యక్తి వ్యక్తిగత స్వార్ధంతో యువకులను తప్పుదోవ పట్టించాడని గతంలో అతని పై 4 క్రిమినల్ కేసు లు ఉన్నాయని తెలియపరిచారు. మావోయిస్టుల్లో కలిసేలా యువకులను ప్రోత్సహించింది బోట్ల అశోక్ అని విచారణలో తెలిందని చెప్పారు.
అశోక్ వద్ద నుండి విప్లవ సాహిత్యాన్ని స్వాధీన పరుచుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని కోర్టుకు హాజరు పరుస్తామని చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యక్తులు చెప్పే మాటలు నమ్మొద్దని వారి అసత్య ప్రచారాలకు బలి కావద్దని మావోయిస్టు పార్టీ భావజాలాన్ని విశ్వసించవద్దని ఎవరైనా వ్యక్తులు మావోయిస్టు భావజాలానికి అనుకూలంగా ఏవైనా ప్రచారాలు చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ పి కోరారు.