మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలలో మంత్రి గంగుల కమలాకర్ విస్త్రతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నేటి ఉదయం నుండి సంస్థాన్ నారాయణపురంలో కాలినడకన ఇంటింటికి తిరుగుతూ టిఆర్ఎస్ అభ్యర్థి కూచికుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక మీడియాతో ప్రజలతో మాట్లాడుతూ గత 70 ఏళ్ళు కాంగ్రెస్ బిజెపిల పరిపాలనలో దేశం ఎలా అధోగతి పాలయిందో మనందరం చూసామని, కేవలం ఎనిమిదేళ్లలో టిఆర్ఎస్ నాయకత్వంలో కేసీఆర్ మార్గదర్శనంలో తెలంగాణ సాధిస్తున్న అద్భుత ప్రగతిని బేరీజు వేసుకోవాలన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఇలా బిజెపిలోకి వెళ్లారని, 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుల కోసం మునుగోడు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన రాజగోపాల్ రెడ్డి ఏనాడు నియోజకవర్గ సమస్యల పరిష్కారం చేయలేదని ఆయన అన్నారు. కనీసం నియోజకవర్గం ప్రజల సమస్యలు వినడానికి కూడా రాలేదని ప్రజలే చెబుతుంటే బాధ కలుగుతుందన్నారు. మిగతా తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మునుగోడును సైతం అదే విధంగా అభివృద్ధి చేసుకోవాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. గెలిచినానంతరం కూసుకుంట్ల తో కలిసి సీఎం దగ్గర మునుగోడు సమస్యలన్నీ ప్రస్తావించి ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించుకునే బాధ్యత తీసుకుంటామన్నారు మంత్రి గంగుల.
ఈ ఎన్నికలు స్వార్థ కాంట్రాక్టులు చేసే అభ్యర్థులకు, పార్టీలకు రెఫరండంగా ఉంటాయని, ప్రజలు నిజమైన సేవ చేసే వారిని గెలిపిస్తారన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ఫ్యాక్స్ ఛైర్మన్ జెక్కిడి జంగారెడ్డి, సీనియర్ నేత ప్రేమ్చంద్రారెడ్డి, నీళ్ల లింగస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.