నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని వసతి గృహాలను, ఆదివారం కలెక్టర్ ఎల్ శర్మన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాగర్కర్నూల్ పట్టణంలోని బిసి, సాంఘిక సంక్షేమ శాఖల బాలికల మరియు బాలుర వసతి గృహాలను ఆయన సందర్శించి వసతి గృహాల్లో చేరిన బాలికల సంఖ్యపై ఆయన ఆరా తీసి హాజరు పట్టికను పరిశీలించారు.
బీసీ, ఎస్సీ బాలికల వసతి గృహాన్ని ఆదివారం సందర్శించిన కలెక్టర్ వంటశాలలను, వసతులను నిశితంగా పరిశీలించారు. ఇంటర్మీడియట్, పదో తరగతి విద్యార్థులను గణిత శాస్త్రంపై ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు.
వార్డెన్లు అందుబాటులో లేకపోవడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కలిసి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వసతి గృహానికి సంబంధించిన వివరాలను విద్యార్థులను తెలియజేశారు.
ఆదివారం అయినా విద్యార్థి విద్యార్థునులు ఉండడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. వసతి గృహ విద్యార్థినులు తమకు ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఏదైనా అత్యవసర ఇబ్బందులు ఉంటే 24 గంటల్లో ఎప్పుడైనా సంప్రదించవచ్చన్నారు.
బాలికల వసతి గృహం వద్ద డ్రెయినేజీ ఇతర ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని సిబ్బందిని కోరారు. బాలికల వసతి గృహంలో సుమారు అరగంట పాటు హాస్టల్లోని అన్ని గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో హాస్టల్లో మాట్లాడి సదుపాయాలపై ఆరా తీశారు.
రానున్న ఇంటర్మీడియట్ పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమై నూరు శాతం ఫలితాలు సాధించాలని ఆదేశించారు. అమ్మాయిలు విద్య పైన అధిక శ్రద్ధ వహించాలని జీవితంలో ఉన్నత స్థితిలోకి రావాలంటే విద్య కీలకమని విద్య నిర్లక్ష్యం చేయకుండా మంచిగా చదువుకొని పరీక్షల్లో మంచి మార్కులతో వసతి గృహానికి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని అన్నారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాలు అందజేయాలని ఏ మాత్రం తేడా లు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగానే వసతి గృహాల్లో ఏర్పాట్లు ఉండాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం వసతి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించారని ఆదేశించారు.