నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట, నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రులను 100 పడకలకు పెంచాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరిక మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు.
నియోజకవర్గంలో ఎంతో మంది పేద ప్రజలు ప్రయివేటు హాస్పిటల్ కి వెళ్లలేక ప్రభుత్వ హాస్పిటల్ పైనే ఆధారపడి ఉంటారని, కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో పేద ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో విన్నపం వంద పడకల హాస్పిటల్ మంజూరుకు హామీ ఇచ్చిన మంత్రులకు ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో త్వరలో వంద పడకల ఆసుపత్రులను నకిరేకల్ నియోజకవర్గంలో ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆసుపత్రితో పాటు నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు కూడా ఎమ్మెల్యే తెలిపారు.
నకిరేకల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కావలసిన మౌలిక వసతుల కల్పన కు కృషి చేస్తామని, మంత్రి జగదీష్ రెడ్డి సహాయ,సహకారాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు.