పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని, వారి త్యాగాలు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని నల్గొండ జిల్లా అదనపు ఎస్పీ సి. నర్మద అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో కరోనా నేపథ్యంలో పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న ఫ్లాగ్ డే సందర్భంగా ఆన్ లైన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు.
నల్లగొండ జిల్లా పోలీసులు. ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ పోలీస్ శాఖలో వినియోగించే ప్రతి ఆయుధం పల్ల విద్యార్థులలో అవగాహన కల్పించడం లక్ష్యంగా ఓపెన్ హౌస్ ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. అయితే పాఠశాల, కళాశాల విద్యార్థులకు పోలీస్ ఆయుధాల వినియోగం, అవహగన కోసం నేరుగా పోలీస్ స్టేషన్లకు, జిల్లా పోలీసు కార్యాలయానికి ఆహ్వానించేవారమని కానీ ఈ ఏడాది కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఎవరికి ఇబ్బంది లేకుండా ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్నామన్నారు.
ప్రజల సేవ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారు ఎల్లప్పుడూ మన గుండెల్లో ఉంటారన్నారు. అలాంటి త్యాగధనులు మన మధ్య లేకుండా ఉన్న మనం వారిని స్మరిస్తూనే ఉంటామని, అసువులు బాసిన అమరవీరుల కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
అమరవీరుల త్యాగాలు మరువలేనివి
అమరవీరుల త్యాగాలు మరువలేనివి అని పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని చెప్పారు. పోలీసు వారు విధుల్లో భాగంగా కుటుంబానికి, పండగలకు, సంతోషాలకు, సరదాలకు దూరంగా ఉంటూ సమాజ సేవ చేస్తారన్నారు. ప్రజా రక్షణ కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా విడిచే పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేని వని కొనియాడారు.
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దేశంలో అంతర్గత భద్రత ప్రజల రక్షణ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భంలోనూ పోలీసు వ్యవస్థ చాలా కీలకంగా పని చేసిందన్నారు. రక్షణ అంటే గుర్తువచ్చేది పోలీస్ అని అలాంటి పోలీసు విధినిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నదని, ప్రతి ఒక్కరు ఏ ఆపద వచ్చినా ఆశ్రయించేది పోలీసులనే అని ఆమె గుర్తు చేశారు.
పోలీసు విధి నిర్వహణ, కేసుల పరిష్కారంపై అవగాహన
ఓపెన్ హౌస్ సందర్భంగా డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీం, క్లూస్ టీములతో పాటు పలు రకాల ఆయుధాలు, వాటి పేర్లు, వినియోగం, ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి చాలనాలు విధించే పద్ధతి, నకిలీ నోట్లు కనిపెట్టడం, దొంగతనాలు జరిగినప్పుడు ఆనవాళ్లు గుర్తించే విధానాలపై అవగాహన కల్పించారు.
ఫ్లాగ్ డే సందర్భంగా ఈ నెల 21 నుండి 31 తేదీ వరకు జిల్లాలో పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు, పోలీసులకు వ్యాసరచన పోటీలు, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం మేకింగ్ విభాగాలలో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఆయుధాల పట్ల విద్యార్థులకు అవగాహన కోసం ఆన్లైన్ ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఏ.ఆర్. డిఎస్పీ సురేష్ కుమార్, ఆర్.ఐ.లు వై.వి.ప్రతాప్, స్పర్జన్ రాజ్, నర్సింహా చారి, ఐటీ సెల్ సిఐ సురేష్ బాబు, ట్రాఫిక్ సిఐ దుబ్బ అనిల్ కుమార్, నర్సింహా రావు, పాటు పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం నాయకులు సోమయ్య, తదితరులున్నారు.