భారీ శబ్దాలు చేసేలా సైలెన్సర్లను మార్చి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న పలు బుల్లెట్లను సీజ్ చేయడంతో పాటు జరిమానాలు విధించారు నల్లగొండ వన్ టౌన్ పోలీసులు. నల్లగొండ వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్ ఆధ్వర్యంలో శుక్రవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తున్న బుల్లెట్లను సీజ్ చేశారు.
జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ ఆదేశాల మేరకు భారీ శబ్దాలను చేస్తున్న వాహనాల వల్ల గుండె జబ్బులు కలిగిన వారు, వయస్సు మీదపడిన వృద్ధులు భయపడుతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పారు. కంపెనీ ద్వారా తక్కువ శబ్దం కలిగిన సైలెన్సర్ల స్థానంలో కొందరు ఇతర సైలెన్సర్లను బిగించి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నారని ఆయన తెలిపారు.
అలాంటి వాహనాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న తొమ్మిది బుల్లెట్ వాహనాలపై కేసులు నమోదు చేశామని ఆయన వివరించారు. బుల్లెట్ వాహనాలతో పాటు ఇతర వాహనదారులు సైతం తమ వాహనాల నుండి అధిక శబ్దం రాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.