లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.నెంబర్ 45 ప్రకారం అనుమతించిన నిత్యావసర సరుకుల దుకాణాలు, కిరాణా, పాల దుకాణాలు సాయంత్రం 6.00 గంటల వరకు తెరిచి ఉంచే వెసులుబాటు కల్పించామని నల్గొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు.
జిల్లాలో అనేక ప్రాంతాలలో మధ్యాహ్నం తర్వాత దుకాణాలు మూసివేస్తున్నారని దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా జి.ఓ. 45లో సూచించిన దుకాణదారులంతా ఉదయం 6.00 నుండి సాయంత్రం 6.00 వరకు తెరిచి ఉంచే వెసులుబాటు కల్పించారని ఆయన చెప్పారు.
ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని, లాక్ డౌన్ లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దనే ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించిందని అన్నారు. వ్యాపారులు పోలీసులతో సహకరిస్తూ లాక్ డౌన్ నిబంధనలు పాటించడంతో పాటు ప్రతి షాప్ వద్ద విధిగా సామాజిక దూరం పాటించేలా చూడాలని, అధిక ధరలకు విక్రయించవద్దన్నారు. ఎక్కడైనా అధిక ధరలకు విక్రయిస్తే డయల్ 100 ద్వారా గానీ, నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్లో గానీ పిర్యాదు చేయవచ్చని ఎస్పీ తెలిపారు. కరోనా మహమ్మారి కట్టడికి పోలీస్ శాఖతో ప్రజలంతా సహకరించాలని ఆయన జిల్లా ప్రజలను కోరారు.