ప్రఖ్యాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ ఆధ్వర్యంలో National Education Policy – 2020 : Perspectives – Challenges in Implementation (జాతీయ విద్యా విధానం – 2020 : దృక్పథాలు – అమలు చేయటంలో సవాళ్ళు) అనే అంశంపై జాతీయ అంతర్జాల సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో వివిధ కేంద్రీయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతులు (Vice-Chancellors) వక్తలుగా పాల్గొన్నారు. రెండు రోజుల సమావేశంలో తొలి రోజుకు ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు సంచాలకులుగా వ్యవహరించారు. రెండవ రోజు సమావేశానికి విక్రమసింహపురి విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య సి.ఆర్. విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో ప్రధాన వక్తగా మిజోరాం కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతివర్యులు ఆచార్య కె. ఆర్.ఎస్. సాంబశివరావు మాట్లాడుతూ అమెరికాలోని విద్యావిధానాన్ని గురించి ప్రస్తావించి కృత్రిమమేధస్సు (artificial intelligence), నైపుణ్యభివృద్ధి, మొదలైన అంశాలపై పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు అవగాహన కలిగించేలా విద్య కొనసాగాలని అన్నారు.
కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ, మైసూర్, ఉపకులపతి ఆచార్య ఎస్. విద్యాశంకర్ ప్రసంగిస్తూ ఉన్నతవిద్య, సాంకేతికవిద్యను, పరిశోధనలను ప్రోత్సహిస్తూ రాష్ట్రాల్లో education task force లు నియమించాల్సిన అవసరం ఉన్నదని తెలియజేశారు.
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం, పూర్వ ఉపకులపతి వర్యులు ఆచార్య పి. జార్జి విక్టర్ మాట్లాడుతూ విద్యావిధానం ఆహ్లాదకరంగా ఉండాలని, జాతీయ విద్యావిధానం 2020 ప్రపంచ అవసరాలకు అనుగుణంగా రూపొందించారని పేర్కొన్నారు.
తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయం, తమిళనాడు, ఉపకులపతి ఆచార్య కె. కుమారవేల్ మాట్లాడుతూ ఈ జాతీయ విద్యా విధానం 2020 భారతదేశంలో నిర్మాణాత్మకమైన మార్పులను తీసుకువస్తుందని తెలియజేశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, హిందీ శాఖ ఆచార్యులు ఆచార్య రాయవరపు సర్రాజు ప్రసంగిస్తూ జాతీయ విద్యావిధానం 2020 ద్వారా భాషల బోధనలో ఎదురయ్యే సమస్యలను వాటిని అధిగిమించాల్సిన ఆవశ్యకతను, పాఠ్యాంశాల రూపకల్పన, బోధనా సమస్యల పరిష్కరణల గురించి తెలియజేశారు.
ఆంధ్రభూమి పత్రిక విద్యా విభాగ కరెస్పాండెంట్ బి. వెంకటప్రసాద్ మాట్లాడుతూ ఈ జాతీయ విద్యావిధానం 2020 ద్వారా ఉద్యోగాల రూపకల్పన విరివిగా జరిగే అవకాశం ఉంటుందని తెలియచేశారు. వివిధ కేంద్రీయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతులు (Vice-Chancellor), పూర్వ ఉపకులపతులు (Former Vice-Chancellor) పాల్గొన్న ఈ సదస్సు మొదటి సమావేశాన్ని ప్రత్యక్షంగా 100 మంది, పరోక్షంగా YOUTUBE ద్వారా 630 మంది వీక్షించారు.
ఈ కార్యక్రమంలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆచార్యులు ఆచార్య భమిడిపాటి విశ్వనాధ్, ఆచార్య భారతుల శారదాసుందరి, ఆచార్య చల్లా శ్రీరామ చంద్రమూర్తి పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయం, చరిత్రశాఖ సహాయాచార్యులు డా. ఎస్. శ్రీనివాసరావు, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, తెలుగుశాఖ సహాయాచార్యులు డా. వరప్రసాద్, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఐఐఐటి-ఒంగోలు) డా. మన్నూరు శివప్రవీణ్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు.