కొల్లాపూర్ సర్కిల్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవ మండపాలకు ఏర్పాటుకు అనుమతి లేదని కొల్లాపూర్ సిఐ బి.వెంకట్ రెడ్డి సోమవారం ప్రకటన చేశారు.
కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గణేష్ మండలపాల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని ఆయన తెలిపారు.
ఈ నెల 22వ తేదీన నిర్వహించుకునే వినాయకచవితి పండుగ సందర్భంగా కొల్లాపూర్ సర్కిల్ పరిధిలో సామూహిక పూజలతో పాటు, గణేష్ నవరాత్రి ఉత్సవ నిర్వహణకు వీలు లేదని అందువల్ల ప్రజలందరూ ఎవరి ఇంటి వద్ద వారే వినాయక చవితి పూజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన కోరారు.
ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యమైన కూడళ్ళలో విగ్రహాల ఏర్పాటు నిషేధమని, అదే విధంగా మొహర్రం పండుగను సైతం ముస్లిం సోదరులు తమ ఇంటిలోనే నిర్వహించుకోవాలని ఆయన కోరారు.
కోవిడ్ 19 నేపథ్యంలో పోలీసుల సూచనను పాటించి కరోనా వ్యాధిని నియంత్రించడంలో ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా పోలీసులకు సహకరించగలరని ముఖ్యంగా పోలీసులు ఉత్తర్వులను అతిక్రమించి గణేష్ మండపాలను ఏర్పాటు చేస్తే సంబంధిత నిర్వహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కొల్లాపూర్ సిఐ తెలిపారు.