‘హింస మార్గం కాదు …అహింస ఆయుధం కారాదు..’అనే లక్ష్యంగా దేశభక్తిని తనదైన శైలిలో నిర్వచించిన అచంచల దేశభక్తి పారాయణుడు, దీక్షాదక్షుడు, కార్యశీలి..మహోన్నత విలువలు గల జాతీయవాది సుభాష్ చంద్రబోస్ మృతి మిస్టరీ ఇప్పటికీ వీడకపోవడంపై భిన్న కధనాలు వినిపిస్తున్నాయి. తాజాగా బోస్ కుటుంబానికి చెందిన వారు ఈ అంశాలను ప్రస్తావిస్తున్నారు.
సుభాష్ బోస్ తాను నమ్మిన తిరుగుబాటు బాటలో నడిచి దేశభక్తిని, జాతీయతభావాన్ని చాటుకునే ప్రయత్నంలో పరాజయాన్ని సైతం పక్కన పెట్టవలసివచ్చింది. 1897 జనవరి 23వ తేదీన ఒడిస్సా లోని కటక్ లో జన్మించిన సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్రోద్యమ కాలంలో నిరంకుశ బ్రిటీష్ పాలన నుంచి జాతిని విముక్తం చేయాలని కంకణం కట్టుకుని అచంచల దేశభక్తి ప్రదర్శించి భారత ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచారు.
బ్రిటీష్ దాస్యశృంఖలాలను తుత్తునియలు చేసి నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలనే సంకల్పం తో జర్మనీ, జపాన్, రష్యా దేశాల మద్దతు కూడగట్టేందుకు పర్యటన తలపెట్టిన సుభాష్ చంద్రబోస్ 1945 లో ఒక విమాన ప్రమాదం లో మరణించినట్లు వచ్చిన వార్తలు యావద్దేశాన్ని కలవరపరచాయి. అయితే ఈ దుర్ఘటన వార్తలను ఇప్పటికీ ఎవరూ ధృవీకరించకపోవడంతో పలు సందర్భాలలో అనుమానాలు వ్యక్తమవుతునే ఉన్నాయి.
సుభాష్ చంద్రబోస్ వ్యక్తిత్వం విలక్షణమైంది. ఇంగ్లాండు లో సివిల్ సర్వీస్ పరీక్షలో నాలుగో స్థానం లో ఉత్తీర్ణులైన బోస్ 1921లో బ్రిటిష్ ప్రభుత్వ సర్వీస్ కు రాజీనామా చేసి సహాయ నిరాకరణ ఉద్యమం లో చేరేందుకు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెసు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గాంధీజీ తో ఏర్పడిన రాజకీయ విభేదాల కారణంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత రెండవ ప్రపంచ యుధ్ధ సమయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన పని చేశారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ ఓ రహస్యమే. ఆయన విమాన ప్రమాదంలో చనిపోయారని.. లేదు లేదు స్వాతంత్య్రం తర్వాత కూడా జీవించే ఉన్నారని, మారువేషంలో దేశంలో సంచరించారని కథనాలు వచ్చాయి. ఓ దశలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నివసించిన గుమ్నామి బాబానే నేతాజీ అని చాలామంది బలంగా నమ్మారు.
ఈ నేపథ్యంలో వాస్తవం తేల్చేందుకు యూపీ ప్రభుత్వం జస్టిస్ విష్ణు సహాయ్ కమిషన్ను నియమించింది. ఆ కమిషన్ ఇటీవల 130 పేజీలతో నివేదిక ఇచ్చింది. 11 కీలక పాయింట్లతో గుమ్నామి బాబా.. నేతాజీ కాదని తేల్చింది. గుమ్నామి.. 1985 సెప్టెంబరు 16న చనిపోయారు. నేతాజీ మరణ మిస్టరీ గానే మిగిలిపోయింది.