దరఖాస్తు చేసుకున్నా మూడు సంవత్సరాల నుండి ప్రభుత్వం ఆసరా పింఛన్లు ఇవ్వకపోవటంతో ఇబ్బంది పడుతున్నారని టిపిసిసి జాయింట్ సెక్రటరీ ఎంపీ అజీజ్ పాషా వివరించారు. గురువారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పి.డి సుందరి కిరణ్ కుమార్ కి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న వితంతువులకు, ఒంటరి మహిళలకు ఏ ఆధారం లేక కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయటంలో కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు.
గత 3 సంవత్సరాల నుండి వితంతువులు,ఒంటరి మహిళలు, వికలాంగులు,వృద్ధులు ఇలా అనేక మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నా దరఖాస్తులను అధికారులు వివిధ రూపాల్లో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అర్హులుగా తేల్చి వారి లాగిన్లో నుండి ప్రభుత్వ ఉన్నత అధికారులకు అప్ లోడ్ చేయటం జరిగిందని కానీ నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లు నూతనంగా మంజూరు చేయలేదని ఆయన అన్నారు. దీనితో వారు ప్రతిరోజు వివిధ పంచాయతీ, మున్సిపాలిటీ,మండల కార్యాలయాల చుట్టూ పెన్షన్ వస్తుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు.
లబ్ధిదారులకు,పేదవారికి ఆసరా ఫించన్ వస్తే కుటుంబ పోషణకు కొంత వరకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 57 సంవత్సరాల వయసు గల వారికి వెంటనే ఆసరా పింఛన్లు ఇవ్వాలని,గత 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న వితంతు,ఒంటరి మహిళల,వికలాంగుల, వృద్ధాప్య,ఆసరా పింఛన్లు కూడా వెంటనే మంజూరు చేసి లబ్ధిదారులను ఆదుకోవాలని అజీజ్ పాషా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కుల మల్లయ్య,ముశం సత్యనారాయణ,షేక్.బిక్కన్ సాబ్,జగన్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్