కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా అయన రిమ్స్ ఆసుపత్రిని సందర్శించి, కేంద్ర పధకాల పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం నూతన వ్యవసాయ చట్టాలపై నిర్వహించిన సదస్సులో పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు.
అన్నదాతల సంక్షేమం అభ్యున్నతే ధ్యేయంగా నూతన వ్యవసాయ చట్టాలను రూపొందించామని మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తుందని కిషన్ రెడ్డి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రైతు చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం ఆవరణలో రైతు అవగాహన సదస్సులో అయన పాల్గొని మాట్లాడారు.
రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా పండించిన పంటను ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకునేలా చట్టాలు రూపొందించి రైతుకు మేలు చేస్తే విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. కొత్త చట్టంలో కనీస మద్దతు ధర ఉంటుందని స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బిజెపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తొలుత నూతనంగా నిర్మిస్తున్న ప్రధానమంత్రి స్వస్థ్ సంరక్షణ యోజన ఆసుపత్రిని కిషన్ రెడ్డి సందర్శించి, వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం టిటిడిసి సమావేశ మందిరంలో కేంద్ర పధకాల పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర పధకాల అమలు తీరును తెలుసుకున్నారు.
ఈ సమావశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఆదిలాబాద్ ఎంపి సోయం బాపురావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.