నలుగురు హైకోర్టు జస్టిస్ లను సత్కరించిన బార్ అసోసియేషన్
విజయనగరం జిల్లా న్యాయస్థానానికి నూతన భవన సముదాయాన్ని రాష్ట్ర హైకోర్టు మంజూరు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్కుమార్ తెలిపారు. వీలైనంత త్వరగా నూతన భవనాన్ని నిర్మించాలని కోరారు. ఈమేరకు నలుగురు హైకోర్టు న్యాయమూర్తులు విజయనగరం జిల్లాకు వచ్చారు.
ఈ సందర్బంగా జస్టిస్ ప్రవీణ్కుమార్తోపాటు, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.మానవేంద్రనాథ్రాయ్, జస్టిస్ టి.రాజశేఖరరావు, జస్టిస్ చీమలపాటి రవి లను విజయనగరం బార్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ముందుగా, ఇటీవల మృతి చెందిన సీనియర్ న్యాయవాది గేదెల రామ్మోహనరావు చిత్రపటాన్ని ఆవిష్కరించి, పూలమాలలతో నివాళులర్పించారు.
స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జస్టిస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. వృత్తిలో అంకితభావం గల సీనియర్ న్యాయవాదులను యువ న్యాయవాదులు ఆదర్శంగా తీసుకొని కష్టపడి పనిచేయాలని కోరారు. సీనియర్ న్యాయవాది గేదెల రామ్మోహనరావు ఆశయాలను, లక్ష్యాలను నిలబెట్టేందుకు జిల్లా బార్ అసోసియేషన్ కృషి చేయాలని కోరారు.
స్వయంకృషితో, కష్టపడే తత్వంతో కష్టపడే వ్యక్తి గేదెల రామ్మోహనరావు: జస్టిస్ మనవేంద్రనాథ్ రాయ్
తన స్వయంకృషితో, కష్టపడే తత్వంతో, అతికొద్ది రోజుల్లోనే గొప్ప పేరును గేదెల రామ్మోహనరావు సంపాదించారని జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ అన్నారు. ఈ మేరకు విజయనగరం వచ్చిన ఆయన మాట్లాడారు. ఈ మేరకు గేదెల రామ్మోహనరావుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. 1987 నుంచీ తనకు రామ్మోహనరావుతో పరిచయం ఉందని, ఆయన రామ్మోహనరావు దగ్గర పనిచేసే జూనియర్లు సుమారు పదిమంది వరకూ న్యాయాధికారులుగా ఉండటం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు.
న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన తనను ఆయన ఎంతగానో ప్రోత్సహించి, అండగా నిలిచారని చెప్పారు. ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, న్యాయవాదిగా రామ్మోహనరావు సమాజానికి ఎనలేని సేవలందించారని కొనియాడారు.విజయనగరం బార్ అసోసియేషన్కు ఘనకీర్తి ఉందని, దానిని నిలబెట్టేందుకు కృషి చేయాలని కోరారు.
జిల్లాకు అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. జస్టిస్ రాజశేఖరరావు, జస్టిస్ రవి మాట్లాడుతూ, తమ అమూల్యమైన సందేశాన్ని వినిపించారు. శ్రమ, పట్టుదల జీవితంలో గొప్ప గుర్తింపునిస్తాయని పేర్కొన్నారు.
సీనియర్ న్యాయవాదులను, యువ న్యాయవాదులు ఆదర్శంగా తీసుకొని, కష్టపడి పైకిరావాలని కోరారు. పెద్దలను గౌరవించాలని, మంచి ప్రవర్తన అలవర్చుకోవాలని సూచించారు. విజయనగరంతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని, నేపథ్యాన్ని జస్టిస్ రవి వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.కల్యాణచక్రవర్తి, జిల్లా ఎస్పి దీపికా పాటిల్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్కుమార్, సీనియర్ న్యాయవాది తమ్మన్నశెట్టి జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఆర్డిఓ భవానీశంకర్, హైకోర్టు న్యాయమూర్తులను సత్కరించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు, విజయనగరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు పి.హరగోపాల్, ఉపాధ్యక్షులు రవిబాబు, కార్యదర్శి అంజనీకుమార్, ఇతర నాయకులు, బార్ అసోసియేషన్ల ప్రతినిధులు, రామ్మోహనరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం