ఆంధ్రభూమి ఉద్యోగులకు తక్షణం పెండింగ్ వేతనాలు చెల్లించాల్సిoదిగా డీసీహెచ్ఎల్ ఆర్పీ మమ్తా బినానీని NCLT హైదరాబాద్ బెంచ్ బుధవారం ఆదేశించింది. ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం మౌఖికంగా జారీ చేసిన అదేశాలపట్ల ఆర్పీ బినాని సైతం సానుకూలంగా స్పందిస్తూ.. తక్షణం చర్యలు తీసుకుంటామని బెంచికి హామీ ఇచ్చారు.
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) హైదరాబాద్ బెంచ్ బుధవారం డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ కేసును సుదీర్ఘంగా విచారించింది. విచారణకు ఆర్పీ మమ్తా బినాని స్వయంగా హాజరయ్యారు. ఆంధ్రభూమి ఉద్యోగుల తరఫున కంపెనీ లా న్యాయ సలహాదారు, కార్పొరేట్ సీనియర్ అడ్వొకేట్ డాక్టర్ ఎస్వీ రామకృష్ణ బెంచ్ ముందు తన వాదన వినిపిస్తూ.. ఏడాది కాలంగా ఆంధ్రభూమి ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం లేదన్నారు.
దీనివల్ల కొందరు ఉద్యోగులు కొందరు మానసిక ఒత్తిడికి, ఆర్ధిక ఇబ్బందులతో మృత్యువాత పడిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. న్యాయసమ్మత ఉద్దేశానికి విరుద్ధంగా ఆంధ్రభూమి ప్రచురణ నిలిపివేయడం వల్ల ఆ విభాగం కార్మికులు రోడ్డున పడ్డారని న్యాయవాది రామకృష్ణ న్యాయమూర్తుల దృష్టికి తెచ్చారు. ఈ విషయంలో కోర్టు మానవతా దృక్పథంతో స్పందించాలని కోరారు.
ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం స్పందిస్తూ ఉద్యోగులను తక్షణం ఆదుకోవాలని ఆర్పీ బినానీని ఆదేశించారు. బెంచ్ ఆదశాలకు స్పందించిన ఆర్పీ తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కోర్టులో విచారణ ముగిసిన తర్వాత మమ్తా బినానీని ఆంధ్రభూమి ఎంప్లాయీస్ అసోసియేషన్ కన్వీనర్ వెల్జాల చంద్రశేఖర్, అడాహక్ కమిటీ సభ్యులు విజయప్రసాద్, జెఎస్ఎన్ మూర్తి, స్వామినాథ్, నగేశ్ కలిసి తాము ఎదురుకుంటున్న ఇబ్బందులను వివరించారు.
సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నానని, బెంచ్ ఆదేశానుసారం తక్షణం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రభూమి ఉద్యోగుల అంశాన్ని న్యాయ స్థానం దృష్టికి తెచ్చిన న్యాయవాది రామకృష్ణ గారికి ఉద్యోగుల అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది.