లాక్ డౌన్ నిబంధనల కారణంగా దేశంలో సరకు రవాణా స్థంభించినందున నిత్యావసరాలు కొరత ఏర్పడింది. ఈ అడ్డంకిని అధిగమించకుండా లాక్ డౌన్ పొడిగించుకుంటూ పోతే విపరీత పరిణామాలు ఏర్పడతాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దాంతో అంతర్ రాష్ట్ర సరకు రవాణాపై తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.
సరకు రవాణా చేసే లారీలు, ట్రక్కులకు సరిహద్దుల వద్ద పాస్ లు అడగవద్దని, స్వేచ్ఛాయుత రవాణాకు వీలు కల్పించాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎస్ లకు కేంద్రం లేఖ రాసింది. అన్ని రవాణా వాహనాలకు అనుమతి ఉందని, వాటిలో ఇద్దరు డ్రైవర్లు, ఓ హెల్పర్ ఉండాలని, చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని వివరించారు.
సరకు అన్ లోడ్ చేసి వెళుతున్న లారీలు, ట్రక్కులను గానీ, లేదా డెలివరీ ఇచ్చేందుకు వెళుతున్న లారీలు, ట్రక్కులను గానీ, లేదా సరుకు లోడ్ చేసుకునేందుకు వెళుతున్న లారీలు, ట్రక్కులను గానీ అడ్డుకోరాదని స్పష్టం చేశారు. దేశంలో సరుకు రవాణాకు అనుమతిస్తూ కేంద్రం ఏప్రిల్ 15నే ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక ఆదేశాలు రానందున ప్రత్యేక పాసులు చూపించాలని అడుగుతుండడంతో రవాణాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ అడ్డంకులు తొలగించేందుకే కేంద్ర హోంశాఖ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.