రాజన్న సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్ లో నిర్మించిన వంద పడకల ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన వైద్య సేవలు అందించేలా వైద్య సిబ్బందిని ఆదేశించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ను వేములవాడ ఎమ్మెల్యే శ్రీ చెన్నమనేని రమేష్ బాబు కోరారు.
వంద పడకల ఆసుపత్రి ప్రారంభానికి చేస్తున్న ఏర్పాట్లపై బుధవారం జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యే సమీక్షించారు. జిల్లాలో అడిషనల్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్.అంజయ్య అనారోగ్యంతో అకాల మరణం చెందడం బాధాకరమని, ఒక మంచి అధికారిని జిల్లా యంత్రాంగం కోల్పోయిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
వంద పడకల ఆసుపత్రి అందుబాటులోకి రావడం ద్వారా నియోజకవర్గ ప్రాంత ప్రజలకు అత్యంత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు వీలుగా ఉంటుందని, ముఖ్యంగా ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్న వారికి చికిత్స అందించేందుకు ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు.
దీంతోపాటు ఒక అంబులెన్సు ప్రత్యేకంగా ఆసుపత్రికి కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలో వైద్యులు, సిబ్బంది ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందించడం గొప్ప విషయమని, ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు.
వేములవాడ ఆసుపత్రి విధులు నిర్వర్తించే డాక్టర్లు వసతి కోసం తన ఇల్లు సంగీత నిలయాన్ని ఉపయోగించుకునే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో సరిపడా వైద్యులు, మందులు, ఇతర పరికరాలను సమకూర్చడం జరిగిందని, 30 పడకలతో ప్రస్తుతం వేములవాడలో అందుబాటులో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని పూర్తిగా వంద పడకల ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందని అన్నారు. రాబోయే వారం రోజుల్లోగా ఆసుపత్రిలో ప్రస్తుతం 50 పడకలతో వైద్య సేవలు ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్యాధికారి డా. సుమన్ మోహన్ రావు, సిరిసిల్ల ఆసుపత్రి పర్యవేక్షకులు డా.మురళీధర్ రావు, వేములవాడ ఆసుపత్రి వైద్యులు డా.మహేష్ రావు పాల్గొన్నారు.