2019-20 ఆర్ధిక సంవత్సరానికి విశాఖపట్నం పోర్టు ట్రస్టు 72.72 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేసి నూతన అధ్యాయం నెలకొల్పింది.
గత ఏడాది (2018-19) లో 65.30 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా చేయగా ఈ సంవత్సరం (2019-20) 7.42 మిలియన్ మెట్రిక్ టన్నులు అధికంగా చేసి, 11.50 శాతం వృద్ధి రేటు సాధించింది. తద్వారా దేశంలోని మేజర్ పోర్టులలో JNPT, ముంబై పోర్టులను దాటి మూడవ స్థానాన్ని దక్కించుకుంది.
తూర్పు తీరంలో మేజర్ పోర్టులలో రెండో స్ధానం దక్కించుకుంది. 1933 లో పోర్టును స్థాపించిన తరువాత ఈ 86 ఏళ్లలో విశాఖపట్నం పోర్టు ఈ స్ధాయిలో కార్గోను రవాణా చేయడం ఇదే ప్రధమం. గతంలో గంగవరం, కృష్ణపట్నం వంటి ప్రైవేటు పోర్టుల పోటీ లేని 2010-11 ఆర్ధిక సంవత్సరంలో విశాఖపట్నం పోర్టు అత్యధికంగా 68 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేసింది.
ప్రైవేటు పోర్టుల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ, ఆర్ధిక మాంద్యం, కోవిడ్ 19 విపత్తు వలన కలిగిన ఎగుమతి దిగుమతుల ప్రతికూల పరిస్ధితులను సైతం అధిగమించి పోర్టు రికార్డు స్ధాయిలో సరుకు రవాణా చేసింది. ఈ ఏడాది అత్యధికంగా చమురు, ఇంధన ఉత్పత్తులు(18.92ఎంఎంటి) రవాణా చేసింది.
అదే విధంగా ఇనుప ఖనిజం, పెల్లెట్స్ (14.39 మిలియన్ మెట్రిక్ టన్నులు), థర్మల్ కోల్ (00.82 మిలియన్ మెట్రిక్ టన్నులు), కోకింగ్ కోల్ (07.45 మిలియన్ మెట్రిక్ టన్నులు), స్టీమ్ కోల్ (09.27 మిలియన్ మెట్రిక్ టన్నులు), ఎరువులు (02.96మిలియన్ మెట్రిక్ టన్నులు)రవాణా చేశారు.
కంటైనర్ (05.03 లక్షల టిఈయూ TEU Twenty-Foot Equivalent Unit) ఇతర సరకులు (10.26 మిలియన్ మెట్రిక్ టన్నులు) రవాణా చేశారు. విశాఖపట్నం పోర్టు ట్రస్టు అవలంబించిన వ్యూహాత్మక వ్యాపార విధానాలతో నేపాల్, విశాఖ పోర్టును ప్రాధాన్య పోర్టుగా ఎంపిక చేసుకుని తమ కార్యకాలాపాలను కొనసాగిస్తోంది.
గత ఏడాది నేపాల్ 16292 కంటైనర్లు హ్యాండిల్ చేయగా ఈ ఏడాది 161 శాతం వృద్ది రేటుతో 42550 కంటైనర్లను రవాణా చేసింది. గతంలో ఈ కార్గోను నేపాల్ కోల్ కతా పోర్టు నుంచి రవాణా చేసేది. వ్యూహాత్మక ప్రణాళికలతో ప్రైవేటు పోర్టుల పోటీని తట్టుకునేందుకు విశాఖపట్నం పోర్టు ట్రస్టు వినూత్న వ్యాపార అభివృద్ది కార్యకలాపాలకు నాంది పలికింది.
ఈ దిశగా వివిధ ప్రభుత్వ రంగ సంస్ధలతో పరస్పర అవగహనా ఒప్పందాలు చేసుకున్నది. ఈ విధానంలో సరుకు రవాణాతో పాటు పూర్తి అనుబంధ సేవలు వినియోగదారులకు అందించింది. ఇందుకోసం వ్యాపార అభివద్ధి విభాగాన్ని ఏర్పాటు చేసుకుంది.
వినియోగదారులకు కొన్ని రకాల రాయితీలను కల్పించడం ద్వారా విశాఖపట్నం పోర్టు తన సేవలను మరింత విస్తృతం చేసింది. ఈ ఏడాది 16.7 శాతం వద్ది రేటుతో 32.1 మిలియన్ టన్నుల కార్గోను రైల్వేల ద్వారా నిర్వహించింది. ఈ ఏడాది విశాఖపట్నం పోర్టు షిప్ టర్న్ ఎరౌండ్ టైమ్, ఒక రోజులో ఒక షిప్ నుంచి నిర్వహించిన సరుకు వంటి వివిధ సూచీలను సవరించి నూతన రికార్డులను నెలకొల్పింది.
ఈ ఏడాది విశాఖపట్నం పోర్టు 198 కోట్ల రూపాయల వ్యయంతో ఈక్యూ 2, ఈక్యూ 3 బెర్త్ ల లోతును 14.5 మీటర్ల స్ధాయికి పెంచి బెర్త్ ల సామర్ధ్యాన్ని ఏడాదికి 6.45 మిలియన్ టన్నుల కి పెంచింది. యాంత్రీకరించిన ఐరన్ ఓర్, బొగ్గు టెర్మినల్స్ ద్వారా రికార్డ్ సమయంలో సరుకు ఎగుమతి దిగుమతి చేసే సదుపాయం కల్పించడం చేశారు.
ఇంకా షిప్ టర్న్ ఎరౌండ్ సమయాన్ని తగ్గించడం వంటి మౌలిక వసతుల కల్పన ద్వారా వినియోగదారుల నిర్వహణ వ్యయాన్ని చాలా వరకూ తగ్గించగలిగింది.
విశాఖ పోర్ట్ చైర్మన్ కే. రామ మోహన రావు, పోర్టు ఉపాధ్యక్షులు P L హరనాధ్ మాట్లాడుతూ ఇంతటి చారిత్రాత్మక ఫలితం సాధించేందుకు కృషి చేసిన ట్రస్టీలకు, ప్రతిఒక్క పోర్ట్ ఉద్యోగికి వారి కుటుంబ సభ్యులకు దీనిని అంకితమిస్తున్నటు ప్రకటించారు.
అలానే పోర్ట్ కార్యకలాపాలలో భాగస్వాములు అయిన పీపీపీ ఆపరేటర్లు, స్టీవెడొరింగ్ ఏజెంట్లు, షిప్పింగ్ ఏజెంట్లు, కాంట్రాక్టర్లు, రైల్వేస్, కస్టమ్స్, జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు.