మహారాష్ట్ర ఐసిస్ మాడ్యూల్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గురువారం పురోగతి సాధించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్ తరపున హింసాత్మక కార్యకలాపాలను ప్రోత్సహించినందుకు మరొక వ్యక్తిని అరెస్టు చేసింది. పూణే కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ అద్నానాలి సర్కార్ (43)ని పూణేలోని కొంధ్వా నుండి అరెస్టు చేశారు. సర్కార్ ఇంట్లో సోదాల సందర్భంగా ఎన్ఐఏ అనేక ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ఐఎస్ఐఎస్కు సంబంధించిన అనేక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఐసిస్ తో చేతులు కలిపి యువతను ప్రేరేపించడం వారిని రిక్రూట్ చేయడం ద్వారా హింసాత్మక ఎజెండాను ప్రోత్సహించడంలో అతని పాత్రను జాతీయ దర్యాప్తు సంస్థ బహిర్గతం చేసింది.
ఖొరాసన్లోని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)/ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్ (ఐఎస్ఐఎల్)/ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)/డైష్/ఇస్లామిక్ స్టేట్ వంటి విభిన్న పేర్లతో పిలవబడే ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది.
NIA పరిశోధనల ప్రకారం ‘మహారాష్ట్ర ISIS మాడ్యూల్’ ద్వారా దేశ ఐక్యత, సమగ్రత, భద్రత, సార్వభౌమాధికారానికి భంగం కలిగించడానికి, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి సర్కార్ ప్రయత్నించాడని తేలింది. ఈ కేసులో ఇది ఐదవ అరెస్ట్. ముంబై, థానే మరియు పూణేలలో విస్తృతమైన సోదాల తర్వాత 3 జూలై 2023న ముంబైలో NIA మరో నలుగురిని అరెస్టు చేసింది. వీరిని ముంబైకి చెందిన తబీష్ నాసర్ సిద్ధిఖీ, పూణేకు చెందిన జుబైర్ నూర్ మహమ్మద్ షేక్ @ అబు నుసైబా, థానేకు చెందిన షార్జీల్ షేక్, జుల్ఫికర్ అలీ బరోదావాలాగా గుర్తించారు.