హైదరాబాద్ లోని పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో పేద, మధ్య తరగతి అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా తక్కువ ధరతో నిమ్స్ నూతనంగా హెల్త్చెకప్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనికి సంబంధించిన బ్రోచర్ను బుధవారం నిమ్స్ సంచాలకులు డా. మనోహర్ ఆవిష్కరించారు.
నగరంలో కార్పొరేట్ ఆస్పత్రులతో పోల్చుకుంటే చాలా తక్కువ ధరకు ఈ ప్యాకేజీని అందుబాటులో ఉంచామన్నారు. ఈ పరీక్షలు చేయించుకోవాలనే ఆసక్తి కలవారు 040-23489022కు సంప్రదించవచ్చని సూచించారు. గతంలో నిమ్స్ ప్యాకేజీ ప్రకటించినప్పటికీ ఆ ప్యాకేజీలో కొన్ని అవసరం లేని పరీక్షలు ఉన్నందున వాటిని తొలగించి కొత్త ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చామన్నారు.
మాస్టర్ హెల్త్ చెకప్ కేవలం రూ.2,800లకే చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, డీఎమ్ఎస్ డా. కేవీ కృష్ణారెడ్డి, జనరల్ మెడికల్ విభాగాధిపతి వైఎస్ఎన్ రాజు, కార్యక్రమ నిర్వాహక సీఆర్వో సత్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.