మునుగోడు నియోజక వర్గంలో టీఆర్ ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించడాన్ని ఏ పార్టీ ఆపలేదనీ, ప్రజలకు టీఆర్ ఎస్ పార్టీపైనే విశ్వాసం ఉందనీ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం నాడు చౌటుప్పల్ మండలం లక్కారం, బంగారిగడ్డ ప్రాంతాల్లో హోంమంత్రి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. గత తొమ్మిది రోజులుగా మునుగోడు నియోజకవర్గం లో తాను పర్యటిస్తున్నానని,
అన్ని మండలాల్లోని ఓటర్లను వ్యక్తిగతంగా కలుస్తున్నానీ వీరందరి అభిప్రాయాలు మేరకు టిఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరని హోమ్ మంత్రి అన్నారు. ముస్లిం ఓటర్లందరితో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న హోం మంత్రి టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న పథకాలను వారికి వివరించారు. ఎనిమిదేళ్ల టీఆర్ ఎస్ ప్రభుత్వ పనితీరు వల్ల ముస్లిం మైనార్టీలు టీఆర్ ఎస్ పార్టీ కోసం కృషి చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న షాదీముబారక్,
కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్ వంటి పథకాలు దేశంలోనే మంచి పేరు సంపాదించాయని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల ఏర్పాటు, ఉపకార వేతనాలు, ఉపకార వేతనాలు, ఉచిత కోచింగ్ సౌకర్యం, ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్, డబుల్ బెడ్రూం ఇళ్లు తదితర పథకాలు ముస్లిం సోదరులకు లబ్ధి చేకూర్చాయని తెలియజేశారు. నల్గొండ జిల్లా ప్రజలను ఫ్లోరైడ్ నీటి నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు విముక్తులను చేసి ఇంటింటికీ కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు తీసుకొచ్చారని హోం మంత్రి అన్నారు.వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ పార్టీ ప్రచారాన్ని కొనసాగించిన ఆయన పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నీ భారీ జార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాబా షరీఫ్, సీనియర్ నాయకులు ద్రుద్దీన్,ఫూర్కాన్, సబిలుద్దీన్, ఫరీద్, ఆరీఫుద్దీన్, జహూరుద్దీన్ యూసెఫీ, మహమ్మద్ షబీర్, సయ్యద్ ఎజాజ్, మహ్మద్ అఫ్రూజ్ తదితరులు కార్యక్రమాలలో పాల్గొన్నారు.