కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రైతుల్లో ఆలోచనలు రేకెత్తిస్తోంది. వందలాది ఎకరాల భూములు మాస్టర్ ప్లాన్ లో భాగంగా రైతులు కోల్పోవడమే ఇందుకు కారణం. ఈ భూములు కోల్పోతున్న వారిలో అధికార పార్టీకి చెందిన వారు కూడా రైతులు ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజాగా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఐటి సెల్ చైర్మన్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మదన్ మోహన్ రావు భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి రైతుగా అడ్లూర్ ఎల్లారెడ్డి రైతు సమన్వయ కమిటీ సభ్యుడు, టిఆర్ఎస్ పార్టీ నాయకుడు సంకరి నారాయణ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. రైతు సమన్వయ కమిటీ మెంబర్ గా ఉన్న తాను నేడు రైతుల కోసం పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 20 సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వెంట టిఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారునిగా కొనసాగానని ఆయన తెలిపారు. రైతుల భూములు లాక్కోవడాన్ని నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.