కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది చనిపోతున్నారు. దేశంలో కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంది. కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కరోనా నిరోధించడంలో మునిగిపోయి ఉంది.
చాలా రాష్ట్రాల అధికార యంత్రాంగం కూడా కరోనాపై పోరాటం చేస్తూనే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి మరో విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా లాక్ డౌన్ అమలులో ఉన్నా కూడా అధికార లాబీలో మాత్రం ఎవరి పని వారు చేసుకుంటున్నారు. లాక్ డౌన్ సామాన్య ప్రజలకేనని తమకు కాదని ఆంధ్రప్రదేశ్ పాలక వర్గం అంటున్నది.
ఇంత కరోనా హడావుడిలో కూడా నామినేటెడ్ పోస్టులు ఇచ్చేస్తూ ఉన్నారు. నామినేటెడ్ పోస్టుల జాతర మాత్రం ఏపిలో ఆగలేదు. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా తమ వర్గం వారికి నామినేటెడ్ పోస్టులు కట్టబెడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. సాక్షి దినపత్రికలో పని చేసే ఆర్.ధనుజయ రెడ్డిని ముఖ్యమంత్రి సలహాదారుడుగా నియమిస్తూ జీవో ఆర్టీ నెం 625 తేదీ 24.03.2020 విడుదల అయింది.
ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ విడుదల చేసిన ఈ జీవో ప్రకారం ధనుంజయ రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారుడుగా వ్యవహరిస్తారు. ఆయన గ్రామ, వార్డు సచివాలయం కార్యదర్శులు, స్పందన కార్యక్రమం పర్యవేక్షిస్తారు. ఈ జీవోలో ఆయన బాధ్యతలకు సంబంధించిన నియమ నిబంధనలు లేవు.
వాటిని ప్రత్యేకంగా తెలియ చేస్తామని ఉత్తర్వులో పేర్కొన్నారు. కరోనా ఉంటేఏం మనవాడైతే చాలు వడ్డించేయ్ అంటున్నారు ఆంధ్రప్రదేశ్ పాలక వర్గం నేతలు.