కామారెడ్డి నియోజకవర్గంలోని పలు పురాతన ఆలయాలు, నూతన ఆలయాల నిర్మాణాలకు, అభివృద్ధికి ప్రభుత్వం 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయాలకు మంజూరైన నిధుల వివరాలను వెల్లడించారు. నియోజకవర్గంలో పురాతన ఆలయాలు, ప్రసిద్ధిగాంచిన ఆలయాలకు పెద్దపీట వేశారు.
ముఖ్యంగా బిక్కనూర్ మండలం సిద్దరమేశ్వర స్వామి ఆలయానికి 2 కోట్లు, చుక్కపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఒక కోటి రూపాయలు కేటాయించారు. అలాగే మాచారెడ్డి మండలంలోని మాచారెడ్డి వెంకటేశ్వర స్వామి ఆలయానికి 25 లక్షలు, వేణుగోపాల స్వామి ఆలయానికి 25 లక్షలు, ఫరీద్ పేట గ్రామంలోని శివాలయనికి 10 లక్షలు, పోతారం గ్రామంలోని హనుమాన్ ఆలయానికి 10 లక్షలు, బండ రామేశ్వర్ పల్లి గ్రామంలోని శివాలయనికి 10 లక్షలు, బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామంలోని శివాలయానికి 25 లక్షలు, హనుమాన్ ఆలయానికి 15 లక్షలు, తిప్పాపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయానికి 10 లక్షలు కేటాయించారు. మొత్తం కామారెడ్డి నియోజకవర్గంలో 162 ఆలయాలకు 10 కోట్లు మంజూరు కాగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 23 ఆలయాలకు 1.14 కోట్లు, కామారెడ్డి మండలంలోని 19 ఆలయాలకు 62 లక్షలు, రాజంపేట మండలంలో 9 ఆలయాలకు 35 లక్షలు, రామారెడ్డి మండలంలో 12 ఆలయాలకు 47 లక్షలు, బిబిపేట మండలంలో 15 ఆలయాలకు 53 లక్షలు, దోమకొండ మండలంలో 30 ఆలయాలకు 87 లక్షలు, మాచారెడ్డి మండలంలో 19 ఆలయాలకు 2.38 కోట్లు, బిక్కనూర్ మండలంలోని 35 ఆలయాలకు 3.64 కోట్ల నిధులు కేటాయించారు.
సంబంధిత ఆలయాలకు టెండర్లు పిలిచి తక్షణమే పనులు ప్రారంభించాల్సిందిగా దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. గతంలో ఆలయాల అభివృద్దికి 38 కోట్లు మంజూరయ్యాయని, ప్రస్తుతం అదనంగా మరొక 10 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు, జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, బల్వంత్ రావు, గైని శ్రీనివాస్ పాల్గొన్నారు.