అమరావతి రాజధానిగా ఉండాలనే డిమాండ్ తో ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో మనస్థాపంతో రాలుతున్న గుండెలు ఎక్కువవుతున్నాయి. రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందని మనస్థాపం చెందిన ఒక వృద్ధురాలు మరణించింది. గుంటూరు జిల్లాలోని నేలపాడులో ఇందుర్తి సుబ్బమ్మ అనే వృద్ధురాలు గత కొద్ది రోజులుగా రాజధాని పై ఆవేదన చెందుతున్నది.
మూడు రాజధానుల నిర్ణయంతో తీవ్ర మనోవేదనకు గురైన సుబ్బమ్మ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందింది. రాజధాని కోసం ఇప్పటి వరకు దాదాపు 10 మంది రైతులు, రైతు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రాజధానిగా అమరావతినే కొనసాగాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమం 31వ రోజుకు చేరింది. మూడు రాజధానులు వద్దు అంటూ రైతులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.