జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ పొత్తును స్వాగతిస్తున్నట్లు జనసేన పార్టీ చిత్తూరు జిల్లా నాయకులు వెల్లడించారు. నేడు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిరుపతి నగర ఇన్ చార్జి కిరణ్ రాయల్ ఈ విషయాన్ని తెలిపారు. ఈ సమావేశంలో కిరణ్ రాయల్ తో బాటు జిల్లా జనసేన పార్టీ నాయకులు హరీష్ శంకర్, రాజారెడ్డి, పసుపులేటి సురేష్, పగడాల మురళి, రాజమోహన్ ఆకేపాటి సుభాషిని, మనోజ్ తదితరులు ఉన్నారు.
బిజెపి, జనసేన పార్టీ పొత్తును సహించలేని వైసిపి నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని వారన్నారు. ఈ చౌకబారు ప్రచారాన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తున్నదని వారు అన్నారు. కమ్యూనిస్టు పార్టీలు జనసేన బిజెపి పొత్తును చూడలేక దిగజారి మాట్లాడుతున్నారని వారన్నారు.
జనసేన బిజెపి పొత్తుపై వీరు అక్కసుతో చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కిరణ్ రాయల్ తెలిపారు. బిజెపి జనసేన రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ సంక్షేమం కోసం పాటుపడేందుకు కలిశాయి తప్ప రాజకీయాల కోసం కాదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న గడ్డుపరిస్థితి నుంచి మంచి మార్గంలోకి మళ్లించేందుకు రాష్ట్రానికి కొత్త రాజకీయం అవసరమని భావించడం వల్లే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు.
రాజకీయ ప్రత్యర్థులు చౌకబారు విమర్శలు మాని రాష్ట్రం కోసం పని చేయాలని కిరణ్ హితవు పలికారు. త్వరలోనే తిరుపతి చిత్తూరు జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించి ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.