పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ఇందుకోసం అందరూ ఇంట్లో మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎస్పీ క్యాంపు కార్యాలయ అవరణలో మంత్రి, జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జిల్లా ఎస్పీ సి. శశిధర్ రాజు, జెడ్పి చైర్మన్ రాoకిషన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, పోలీస్ అధికారులు కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మొక్కలను ప్రతి ఒక్కరు సంరక్షించాలని పిలుపునిచ్చారు. చెట్టును నరికితే హత్య చేసిందానికoటే మహపాపమని అన్నారు. మొక్కలను నాటడమే కాదు వాటిని సంరక్షించినట్లయితే అడవులుగా విస్తరిస్తాయని తద్వారా వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పని పూర్తి అయిందని అనుకోకుండా నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవలసిన బాధ్యత కూడా ఉన్నదని అన్నారు.
ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రమంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా మొక్కలు నాటడం జరిగిందని చెప్పారు. చెట్లను మానవాళి అవసరాల కోసం నరికివేయడం అందుకు అనుగుణంగా మొక్కల పెంపకం చేపట్టకపోవడం కారణంగా కరవు పరిస్థితులు ఏర్పడుతున్నాయని అందువల్ల ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.
అనంతరం మంచిర్యాల చౌరస్తా నుండి కొండాపూర్ వరకు నూతనంగా ఏర్పాటుచేసిన (25) సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ పోలీసు స్టేషన్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ మంత్రి గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, సందర్శించి వాటి పనితీరును చూశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకట్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ వెంకటేష్, ఆర్.ఐ. వెంకటి, యం.టి.ఓ. వినోద్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.