తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. మాడు పగిలే ఎండా కాలం స్టార్ట్ అయింది.. జాగ్రత్తలు తీసుకోండి..అంటూ హితవు పలికింది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ ఎండలు మండి పోతున్నాయి. మార్చి నెల లోనే వడగాలుల తీవ్రత కూడా మొదలైంది. భానుడి ప్రతాపంతో ఇటు తెలంగాణ, అటు ఏపీ లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. దీంతో పెరుగుతున్న ఎండలకు ఎవరూ బయటకు కూడా రావడం లేదు.. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు.
ఈ క్రమంలో ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన జారీ చేసింది. 50 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో కూడా ఎండలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీంతో, పలు ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తీవ్ర ఎండలు దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వడదెబ్బ తగలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.