అన్ని వర్గాల సంక్షేమంతో పాటు, పల్లెలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడుజిల్లా మాదల గ్రామంలో నాలుగవ రోజు గడపగడప మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన కరపత్రాలు అందించారు. సోమవారం ఆయన 295 కుటుంబాలను సందర్శించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను అడిగి తెలుసుకున్నారు. వాలంటీర్ల సేవలను ఆరా తీశారు . కాపు నేస్తం అందుతుందా ?అమ్మఒడి మీ ఖాతాలో జమ అయిందా, పెన్షన్ వస్తుందా , సకాలంలో వాలంటీర్ల సేవలందిస్తున్నారా.? సచివాలయ వ్యవస్థ ఎలా ఉంది, గ్రామంలో మీకు ఏమైనా పనులు కావాలా.? అని అడిగి తెలుసుకుని వారి సమస్యలను తక్షణం పరిష్కరిస్తున్నారు. స్థానికుల నుంచి సిసి రోడ్లు, విద్యుత్ స్తంభాలు, మురుగుకాల్వల నిర్మాణానికి వినతులు రాగా సచివాలయానికి వచ్చే రూ. 20 లక్షల నిధులతో గ్రామంలో శాశ్వతవనరుల కల్పన , సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులు నిర్వహిస్తామన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టి కృషితో గ్రామ అభివృద్ధికి తోడ్పాటును సందించాలన్నారు. నియోజవర్గ ప్రత్యేక నిధి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సచివాలయానికి ఇస్తున్న రూ.20 లక్షలతో కలిపి మొత్తం సుమారు రూ.60 లక్షలతో గ్రామములో శాశ్వత అభివృద్ధి పనులు, వసతుల కల్పనకు అంచనాలు వేయిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ సింగంశెట్టి కోటేశ్వరమ్మ , ఎంపీటీసీలు గోగుల నాగ అంజిబాబు, చిన్న మహబూబ్,ఉప సర్పంచ్ సైదా, కానాల పుల్లారెడ్డి, మండల నాయకులు ఎంజీఆర్ లింగారెడ్డి, సిరిగిరి గోపాలరావు, కౌన్సిలర్ అచ్యుత శివ ప్రసాద్, రావిపాటి బసవయ్య,ఎంపీడీవో పుట్టారెడ్డి, తహశీల్దార్ భవాని శంకర్, సచివాలయ సిబ్బంది, పలు గ్రామాల సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.