రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్య సేకరణ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఖరీఫ్ 2023-24 ధాన్యం కొనుగోలు ప్రక్రియపై డిఆర్డిఓ, సహకారశాఖ, వ్యవసాయ, రైస్ మిల్లర్స్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ధాన్య సేకరణ కు జిల్లా వ్యాప్తంగా 230 ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు మద్దతు ధర పొందేందుకు ధాన్యాన్ని బాగా ఆరబెట్టి చెత్తా, తాలు, పొల్లు, మట్టి లేకుండా శుభ్రపరిచి కేంద్రాలకు తీసుకువచ్చేలా అవగాహన కల్పించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రద్దీ నియంత్రణకు వ్యవసాయ అధికారులు క్రాప్ బుకింగ్ చేసిన ప్రకారం రైతులకు టోకెన్లు జారీ చేయాలని చెప్పారు.
కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగులు, టార్పాలిన్, తూకం, తేమ పరీక్ష యంత్రాలు, టెంట్, త్రాగునీరు తదితర మౌళికసదుపాయాలు కల్పించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఏ రోజు కారోజు ఆన్లైన్ చేసి రైస్ మిల్లులకు తరలించాలని దిగుమతిలో జాప్యం జరుగకుండా రైస్ మిల్లర్లు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. కావాల్సిన హమాలీలను అందుబాటులో ఉంచాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అధికారులు, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్ల రైతులకు మంచి ధర లభిస్తుందని అదనపు కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా సహకార అధికారిణి విజయకుమారి, జిల్లా పౌరసరఫరాల అధికారిణి శ్రీలత, అదనపు డిఆర్డిఓ జయశ్రీ, క్వాలిటీ కంట్రోల్ మేనేజర్, రైస్ మిల్లర్స్ అసోషియేషన్ అధ్యక్షులు బొమ్మ రాజేశ్వరరావు, ధాన్య సేకరణ కేంద్రాల బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.