ముఖ్యమంత్రి జగన్, మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ లు యాగశాల ప్రాంగణంలోకి చెప్పులతో రావడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం అధికార వైసీపీకి తలవంపులు తెచ్చిపెట్టింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం జగన్ వ్యక్తిగత మేలు కోసం ప్రభుత్వ ఖర్చుతో అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ యాగంలో పాల్గొంటే మళ్లీ అధికారం సిద్ధిస్తుందని కొందరు చెప్పడంతో సీఎం జగన్ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
సతీసమేతంగానే యాగం చేయాల్సి ఉండగా సీఎం జగన్ మాత్రం సింగిల్ గానే వచ్చారు. యాగంలో సంకల్పం చెప్పుకోవడానికి వచ్చే సమయంలో ఆయన, ఆయనతో బాటు మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ లు చెప్పులతోనే వచ్చేశారు. యాగ ప్రదేశంలో చెప్పులు వేసుకుని రావడం తీవ్ర అభ్యంతరకరం. అధికారికంగా విడుదల చేసిన ఫొటోలలోనే సీఎం, మంత్రులు చెప్పులు వేసుకుని వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. దాంతో తీవ్రంగా విమర్శలు చెలరేగాయి.