పాకిస్తాన్ లో రాజకీయ నాయకులకు కరోనా సోకడంతో ఆ దేశంలో రాజకీయ దుమారం రేగుతున్నది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితుడైన పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ప్రతిపక్షనాయకుడు, పిఎంఎల్ -ఎన్ అధ్యక్షుడు షహబాజ్ షరీఫ్ కు కరోనా పాజిటీవ్ వచ్చింది.
అతను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడని, అతడిని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణకు పిలవద్దని ఆ పార్టీ చెప్పినా నేషనల్ ఎకౌంటబులిటీ బ్యూరో అతడిని విచారణకు పిలిచింది. అతడిని విచారణ చేసిన మరునాడే అతడికి కరోనా పాజిటీవ్ రావడంతో ఆ పార్టీ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించింది.
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నందునే తాము అతడిని విచారణకు పిలవద్దని చెప్పామని అయితే బ్యూరో వినలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి మరియం ఔరంగజీబ్ అన్నారు. ఎన్ఏబి విచారణకు పిలవడం వల్లే తమ నాయకుడికి కరోనా సోకిందని పార్టీ నాయకుడు అతుల్లా తరార్ కూడా అన్నారు.
ఎలాంటి బహిరంగ సభలకు వెళ్లకుండా, ఎవరినీ కలవకుండా ఇంట్లోనే ఉన్న తమ నాయకుడిని ఎన్ఏబి విచారణకు పిలిచిందని, అక్కడే ఆయనకు కరోనా సోకిందని వారు తెలిపారు. గతంలో పలుమార్లు విచారణకు పిలిచినా ఆరోగ్య కారణాలు చూపుతూ రాలేదని అందువల్లే ఈ సారి పిలిచామని అధికారులు అంటున్నారు. తమ నాయకుడికి ఏదైనా జరిగితే పాకిస్తాన్ మొత్తం ఉద్యమం చెలరేగుతుందని ఆ పార్టీ నాయకులు హెచ్చరించారు.
పిటిఐ పార్టీ కరాచీ అధ్యక్షుడు, సింధ్ అసెంబ్లీ సభ్యుడు అయిన ఖుర్రం షార్ జమాన్ కు కూడా కరోనా సోకింది. కరోనా లాక్ డౌన్ ను పూర్తిగా వ్యతిరేకించిన ఖుర్రం కు కరోనా పాజిటీవ్ రావడం ఇక్కడ గమనార్హం. లాక్ డౌన్ వల్ల కరోనా ఆగదని, లాక్ డౌన్ వ్యర్ధమని ఖుర్రం ఇంత కాలం వాదించాడు.