తెలంగాణలో అమలు చేస్తున్న కంటివెలుగు కార్యక్రమం అద్భుతమని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ కొనియాడారు. ఖమ్మం సభలో భారీ జనసందోహాన్ని చూసి భగవంత్మాన్ ఉప్పొంగిపోయారు. ఇంతమందిని చూడటానికి కేసీఆర్ తమకు ప్రత్యేక అద్ధాలు ఇవ్వాలంటూ చమత్కరించారు.
బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ అని అన్నారు. విపక్షాల ఎమ్మెల్యేలను కొనాలి.. అధికారంలోకి రావాలి ఇదే బీజేపీ సూత్రం అని విమర్శించారు. అన్ని సమయాలు ఒకేలా ఉండవని, రాజు బికారి అవుతాడని, బికారి రాజు అవుతాడని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశమనే పుష్ఫగుచ్ఛంలో అన్ని రకాల పువ్వులు ఉంటేనే బాగుంటుందన్నారు.
కానీ కొందరు ఒకే రకమైన పువ్వును కోరుకుంటున్నారని విమర్శించారు. దొడ్డి దారిలో అధికారంలోకి రావడంలో బీజేపీ నంబర్ వన్ అని, మోదీ ప్రజల కోసం కాదు తన మిత్రుల కోసం పని చేస్తున్నారని అన్నారు. ఎర్రకోటపై మోదీ 8 ఏళ్లుగా ఒకేరకమైన మాటలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజల జీవితాలను మోదీ ఎలాగూ మార్చలేకపోతున్నారని, కనీసం తన ప్రసంగాన్నైనా మార్చుకోవాలని సూచించారు.