పార్లమెంటు సమావేశాల ముందు ఒక ఎంపిని కదలకుండా అడ్డుకోవచ్చా? ఏమో తెలియదు కానీ తెలంగాణ పోలీసులు మాత్రం రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు.
పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా ఆయనను అడ్డుకుంటున్నారు. కొకాపేట ప్రభుత్వ భూముల అమ్మకాల్లో వెయ్యి కోట్లు అవినీతి జరిగినట్టు రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.
ఈ రోజు పార్లమెంట్ లో కేంద్ర హోమ్ శాఖ మంత్రికి ఆధారాలతో ఫిర్యాదు చేస్తానని కూడా ఆయన ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఆయనను పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లు రవి అన్నారు.
ఇది నియంతృత్వానికి పరాకాష్ట అని మల్లు రవి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో కొకాపేట అవినీతిని ఎండగడతాడనే భయంతోనే పోలీసులతో కేసీఆర్ ఇలా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
ఇది అప్రజాస్వామికం.. ఇంత దుర్మార్గం ఎక్కడా చూడలేదు.. ఈ నియంత, అవినీతి పాలకులకు ప్రజలే తగిన బుద్ధి చెవుతారు అని మల్లు రవి వ్యాఖ్యానించారు.