కార్పొరేషన్ పదవుల పందారం నేపథ్యంలో జిల్లా పార్టీల్లో సొంత కుంపట్లు ఎక్కువ అయ్యే అవకాశం కలిగిందని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాపోతున్నారు.
ఇప్పటికే చాలా జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగియాయి. ఈ నేపథ్యంలో జరిగిన కార్పొరేషన్ చైర్మన్ పదవుల నియామకాలు వీటికి ఆజ్యం పోసే విధంగా తయారైంది. చిత్తూరు జిల్లా వైసీపీలో ముఠా తగాదాలు దారుణంగా ఉన్నాయి.
అక్కడి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విస్తృత అధికారాలు ఉండటం పార్టీలో చాలా మందికి నచ్చడం లేదు. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా కు పోటీగా ఇప్పుడు మరో ముస్లిం వర్గానికి చెందిన నేతకు కార్పొరేషన్ పదవి కట్టబెట్టారు. కార్పొరేషన్ లలో కొద్దో గొప్పో డబ్బులు ఉన్న కార్పొరేషన్ అయిన ఏపిఎండీసీ చైర్ పర్సన్ గా షమీమ్ అస్లామ్ ను నియమించారు.
వీరిద్దరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇద్దరూ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం పోటీ పడగా షమీమ్ కు సర్ది చెప్పి నవాజ్ బాషా కు టిక్కెట్ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా వర్గ పోరాటం తగ్గకపోగా పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితిలో షమీమ్ కు పదవి రావడంతో ఇక అక్కడి పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
అదే జిల్లాకు చెందిన నగరి నాయకుడు చక్రపాణిరెడ్డి స్థానిక ఎమ్మెల్యేకు కంటిలో నలుసుగా తయారయ్యారు. ఇప్పుడు ఆయనకు మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులతో కార్పొరేషన్ పదవి దక్కింది.
నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజాకు ఉన్న పదవి ఊడబెరికి చక్రపాణిరెడ్డికి కొత్త పదవి కట్టబెట్టటంతో నగరి నియోజకవర్గంలో ఎవరివైపు ఉండాలో అర్థంకాని వైసీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్ర తికమకలో పడిపోయారు.
అదే జిల్లాకు చెందిన గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి మాజీ ఎంపి నేంద్ర రెడ్డికి మధ్య అసలు సయోధ్య లేదు.
పరిస్థితి ఇలా ఉండగా మాజీ ఎంపి కుటుంబంలో ఒకరికి మంత్రి పెద్దిరెడ్డి పదవి ఇప్పించారు. దాంతో ఉప ముఖ్యమంత్రి వర్గం అయోమయంలో పడిపోయింది. చిత్తూరు జిల్లాలో సీనియర్ నాయకుడు అయిన చింతల రామచంద్రారెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ ల భర్తీ తీవ్ర నిరాశను మిగిల్చింది.