వరుస చోరీలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేసిన్నట్లు ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు యస్.వారియర్ తెలిపారు.
నగరంలోని పాకబండ బజార్ కు చెందిన షేక్ నయిమ్ (27) తుమ్మలగడ్డకు చెందిన షేక్ ఆసిఫ్ ఖాన్ (26) జల్సాలకు అలవాటుపడి దొంగతనం ద్వారా సులభంగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశ్యంతో తాళాలు వేసి ఉన్న ఇళ్ళను లక్ష్యంగా ఎంచుకొని రెక్కి నిర్వహించి దొంగతనాలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఖమ్మం- I టౌన్(3) టూ టౌన్ (01) ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్ల పరిధిలో (02) మొత్తం ఆరు చోట్ల ప్రాపర్టీ చోరీ కేసుల్లో వీరు నిందితులుగా వున్నారని తెలిపారు.
ఇలాంటి నేరగాళ్లు బయట తిరుగుతున్నంత కాలం దొంగతనాలు, నేరాలను అదుపు చేయడం కష్టాసాధ్యమని, అందుకే ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ)యాక్ట్ నిందితులపై అమలు చేసినట్లు తెలిపారు.
నేరాలు ప్రవృత్తిగా మార్చుకొని దొంగతనాలు, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే నేరగాళ్ళపై నిఘా పెట్టామని, భవిష్యత్తులో ఇలాంటి నేరాలు పునరావృతం అయితే ఉపేక్షించేది లేదని, నిందుతులపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు.
ప్రాపర్టీ దొంగతనాల కేసుల్లో రిమాండ్ అయి ఇటీవల బెయిల్ పై విడుదలైన నిందితులు తిరిగి నేరాలు చేసే ఆవకాశం వున్నందున ఈ నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు తెలిపారు. ఖమ్మం వన్ టౌన్ సిఐ చిట్టిబాబు తన సిబ్బందితో కలసి నిందితులను ఈరోజు హైదరాబాదు చంచల్ గూడ సెంట్రల్ జైలు తరలించారు. సెంట్రల్ జైలు అధికారులను కలసి పిడీ యాక్ట్ కాపీలను అందజేసి నిందితులను అప్పగించారు.