విశాఖపట్నం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సీలేరు నదిలో ప్రయాణికులతో వెళ్తున్న రెండు నాటు పడవలు ప్రమాదానికి గురయ్యాయి.
పడవలు నీట మునగడంతో 8 మంది గల్లంతు కాగా, వారిలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. ప్రమాదం నుంచి బయటపడి ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
గిరిజనులు ఒడిశా వెళ్లేందుకు నాటు పడవలో వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గల్లంతు అయిన మరో ముగ్గురి కోసం స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
గల్లంతైన వారు కొందుగూడ గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు. మొత్తం ఐదు పడవల్లో ప్రయాణిస్తుండగా రెండు పడవలు బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగనట్లు తెలుస్తోంది.
రిజర్వాయర్ వద్ద గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. గాలింపు చర్యల్లో ఏడాది పసిబిడ్డ మృతదేహం లభ్యమైంది.
ఈ ఘటనపై పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆరా తీశారు. సీలేరు జెన్కో అధికారులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి ప్రమాదం గురించి తెలుసుకున్నారు.
సహాయ చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలను ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కోరారు.
హైదరాబాద్ నుంచి వలస కూలీలు 11 మంది ఒడిశా వెళ్లేందుకు అర్ధరాత్రి సీలేరు చేరుకున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో నాటు పడవల్లో వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.