లాక్ డౌన్ సడలింపు లో భాగంగా ప్రభుత్వ నిబంధనలను పాటించని వ్యాపార సంస్థలు, ప్రజలకు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ అధికారులు జరిమానాలు విధించడం ప్రారంభించారు. ఈ నెల 29 వరకు మూడవ దశ లాక్ డౌన్ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే.
అన్ని వ్యాపార సంస్థల యజమానులు తమ వ్యాపారాన్ని కొనగించుకోవచ్చని రాత్రి 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ యధావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం తెలియజేసింది. ఐతే జన సమూహం ఎక్కువగా ఉండకూడదన్న దృక్పథంతో అన్ని దుకాణాలకు A, B కేటగిరీలుగా విభజించి ఒక రోజు A మరుసటి రోజు B కేటగిరి పద్ధతిలో దుకాణాలు నిర్వహించుకునే విధంగా ప్రభుత్వం నిబంధనను పెట్టింది.
అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉన్నపుడు ప్రతి ఒక్కరు మూతికి మాస్క్ ధరించాలని తెలిపింది. ఇవి పాటించని వారికి జరిమానా కూడా విధిస్తామని తెలియజేసింది. ఈ నిబంధనలను తుంగలో తొక్కి పలువురు వ్యాపారులు తమ ఇష్టానుసారంగా నడుపుకోవడం, మాస్కుల లేకుండా తిరుగుతున్న ప్రజలను స్థానిక మున్సిపల్ అధికారులు గమనించారు.
సోమ, మంగళ వారాలలో పోలీసుల సహకారంతో మున్సిపల్ అధికారులు పట్టణంలో తనిఖీలు నిర్వహించగా పలు వ్యాపార సంస్థలు నిబంధనలకు వ్యతిరేకంగా దుకాణాలు తెరిచి ఉండటంతో వారికి రూ. 2000, మాస్కులను ధరించని వారికి రూ.1000 చొప్పున జరిమానాలు విధించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించుకోవాలని, దుకాణాల్లో జన సమూహం లేకుండా చూసుకోవాలని, దుకాణం లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి శానిటీజర్ అందుబాటులో ఉంచాలని మున్సిపల్ కమిషనర్ ఏ ప్రభాకర్ తెలిపారు.