వివిధ రంగాల్లో పనిచేసే అసంఘటత రంగ కార్మికుల స్థితిగతులపై సర్వే నిర్వహించడం,సర్వేలో వచ్చిన సమస్యల పరిష్కారం కోసం ఈనెల 26న,చలో కార్మిక శాఖ కార్యాలయం సూర్యాపేట, కోదాడ ముట్టడికి పెద్ద ఎత్తున కార్మిక వర్గం కదిలి రావాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి కార్మికులకు పిలుపునిచ్చారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ, మండలం సింగారం గ్రామంలో గ్రామీణ హామాలీల కార్మికుల సర్వే సందర్భంగా శీతల రోషపతి మాట్లాడుతూ అనేక విషయాలు కార్మికుల ద్వారా తెలుసుకోవడం జరిగిందని,ఒక సంవత్సరంలో మూడు నుంచి నాలుగు నెలలు మాత్రమే పనులు దొరుకుతున్నాయని,దీంతో కుటుంబాలు గడవటం కష్టంగా ఉందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్, నిత్యవసర ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తూ,చివరకు పాలు,పెరుగు,నిత్యవసర సరుకులపై జిఎస్టి విధించటం మూలికే నక్కపై తాటి పండు పడ్డ చందంగా ఉందని తీవ్రంగా విమర్శించారు.
నాడు బ్రిటిష్ సర్కారు వివిధ రకాల పన్నులు శిస్తులతో ప్రజలను పీక్కు తినేవారని,నేడు కేంద్ర సర్కారు అదే పంథాలో పని చేస్తుందని రోషపతి ఎద్దేవా చేశారు.ఈ ప్రభుత్వాలకు సరైన సమయంలో గుణపాఠం చెప్పటనికి ప్రజలు సిద్ధంగా ఉండాలని అన్నారు.అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర వేతన చట్టం చేయాలని,భవన నిర్మాణ కార్మికులకి ప్రభుత్వం ప్రవేశపెట్టే హెల్పర్ బోర్డ్ వీరికి కూడా వర్తింప చేయాలని,అర్హులైన కార్మికులకు డబల్ బెడ్ రూమ్,పని దొరకని రోజుల్లో నెలకి 7500 రూపాయల చొప్పున ప్రతి కుటుంబానికి ఇవ్వాలని, నిత్యవసర సరుకులు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో హమాలీ మేస్త్రీలు, కార్మికులు దండగల ఏడుకొండలు, పాలవెన్నెల రవి,ఎస్.కె.నాగులమీరా,జే వెంకన్న,అశోక్,రామ్ రాజ్,మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్