ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ నీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా రాయలసీమపై ఇకనైనా దృష్టి సారించాలని నవీన్ కుమార్ రెడ్డి కోరారు.
చిత్తూరు జిల్లాలో పెండింగ్ లో ఉన్న హుంద్రీ నీవా గాలేరు-నగరి ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా చిత్తూరు జిల్లా పరిశ్రమలకు అనుకూలంగా ఉందని అందువల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కోసం పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక రాయితీలు కల్పించాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అలాగే టీటీడీలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు టైం స్కేల్ కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
తిరుమల శ్రీవారి ఆస్తుల,నిధుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో వ్యాపారాలు లేక ప్రజలు అలాగే 50 శాతం జీతాలతో ఉద్యోగస్తులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పెరిగిన విద్యుత్ చార్జీల భారం నుంచి ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.