బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి
రెండు రోజుల్లో ధరణిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోతే మంగళవారం నుంచి ఆమరణ దీక్ష చేపడతానని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. ధరణి పోర్టల్ వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన నేటి నుంచి మూడు రోజుల పాటు నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్బంగా పలు మండలాల నుంచి రైతులు తమ సమస్యలు చెప్పుకోవడానికి దీక్ష శిభిరానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ అక్రమార్కులకు వరంగా మారిందన్నారు. సామాన్య రైతుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని తెలిపారు.
మాచారెడ్డి మండలం భవానిపేట గ్రామంలో 766 సర్వే నంబరులో గతంలో 625 ఎకరాల భూమి ఉంటే దానిని 930 ఎకరాలకు మార్చారని, ఆ 300 ఎకరాల భూమికి ఎకరానికి 10 వేల చొప్పున రైతుబంధు తీసుకుంటున్నారని ఆరోపించారు. రైతులు తమ పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పులను సరిదిద్దాలని తహసిల్ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్దిరోజులుగా అవినీతి అక్రమాలపై సాక్షాలతో సహా బయటపెట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరినా ఆయన నుంచి స్పందన కరువైందన్నారు.
గత కలెక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా 153 ఎకరాల ప్రభుత్వ భూములకు ఇచ్చిన ఎన్ఓసిలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణంలోని సర్వే నంబర్ 6 లో గల భూమిని మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకోవాలని రెవిన్యూ అధికారులు చెప్పినా ఇంకా స్వాధీనం చేసుకెలకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ధరణిలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, రైతులకు బాసటగా నిలవాలని అధికారులను కోరారు. సోమవారం సాయంత్రం లోపు అధికారుల్లో కదలిక లేకపోతే మంగళవారం నుంచి ఆమరణ దీక్ష చేపడతానని హెచ్చరించారు. తన ప్రాణం పోయినా దీక్ష ఆపేది లేదని స్పష్టం చేశారు.